పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావులు సూచించారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అయిన కేజీ నుంచి పీజీకి అనుగుణంగా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పారు.
ఈ మహత్తర కార్యంలో అందరూ భాగస్వాములై అంకితభావంతో పని చేయాలన్నారు. తొలి విడుతలో మూడో వంతు పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. కార్యక్రమం కింద 12 అంశాలకు సంబంధించిన వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాల్సిందిగా సూచించారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలని అన్నారు.
కరోనా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. 15నుంచి 18సంవత్సరాల వారికి సైతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ బడులు మరింత పటిష్టం చేసేందుకు త్వరలో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారి భాగస్వామ్యం కోరతామని అన్నారు. జిల్లాలో 371 పాఠశాలలకు పనులను గ్రౌండింగ్ చేసే సమయానికి అన్ని ఏర్పాట్లను చక్కబెట్టి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాజు పాల్గొన్నారు.