ఏన్నో ఏండ్లుగా పార్టీనే నమ్ముకున్న స్థానిక నేతలను కాదని.. ప్యారాచూట్ నేతలను అందలం ఎక్కించడంపై ఇటు, కాంగ్రెస్, అటు బీజేపీలో కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల కిందట ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనిపై ముందస్తుగానే అందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ కీలక నేతలెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. మరో వైపు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో అంతర్గత పోరు మరింత పెరుగుతున్నది. ఇప్పటికే రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిగా నడుస్తున్న ఈ టికెట్ వ్యవహారం ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డిని కూడా అంటుకున్నది. తనకు సన్నిహితుడైన దండెం రాంరెడ్డి కోసం ఉత్తమ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరో చర్చ మొదలైంది. అంతేకాకుండా రాంరెడ్డి గతంలో మల్రెడ్డి రంగారెడ్డి సమావేశం నిర్వహించిన కన్వెన్షన్ హాల్లోనే సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. నేతల తీరుతో క్యాడర్ అయోమయంలో పడింది.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం
Parachute Leaders | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకున్న స్థానిక నేతలను కాదని.. ప్యారాచూట్ నేతలను అందలం ఎక్కించడంపై కాంగ్రెస్లోనే కాదు.. బీజేపీలోనూ నేతలు భగ్గుమంటున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేపీలోనూ ఇదే కలకలం మొదలైంది. రెండు రోజుల కిందట ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనిపై ముందస్తుగానే అందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ కీలక నేతలెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. వాస్తవానికి ఆ పార్టీ నుంచి పలువురు స్థానిక నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈమేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బూర నర్సయ్యగౌడ్ పరోక్షంగా సంకేతాలు పంపేందుకు రెండు రోజుల కింద ఇబ్రహీంపట్నంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించారు. పలువురు నేతలు, కార్యకర్తలు సమావేశానికి వచ్చినప్పటికీ కీలకమైన నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అశోక్గౌడ్, అర్జున్రెడ్డి, బాషా, దయానంద్గౌడ్ తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి దూరంగా నిలవడంతో పాటు టికెట్ కేటాయింపుపై గళం విప్పుతున్నారు. ప్యారాచూట్ నేతకు టికెట్ ఎలా ఇస్తారంటూ వీరిలోని పలువురు నాయకులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటిదాకా కాంగ్రెస్ శ్రేణులనే వెంటాడిన ఈ బెడద ఇప్పుడు కమలంలోనూ మొదలైందని జనం చర్చించుకుంటున్నారు.
అదే ఫంక్షన్ హాల్లో..
మరో వైపు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో అంతర్గత పోరు మరింత పెరుగుతున్నది. ఇప్పటికే రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిగా నడుస్తున్న ఈ టికెట్ వ్యవహారం ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డిని కూడా అంటుకున్నది. తనకు సన్నిహితుడైన దండెం రాంరెడ్డి కోసం ఉత్తమ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ నియోజకవర్గంలో మరో చర్చ మొదలైంది. దీంతో రాంరెడ్డి తాజాగా శుక్రవారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మల్రెడ్డి రంగారెడ్డి సమావేశం నిర్వహించిన పెద్ద అంబర్పేటలోని తార కన్వెన్షన్ హాల్లోనే రాంరెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాంరెడ్డి వర్గం నేతలు టికెట్ తమ నేతకే ఖరారు చేశారంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఒకడుగు ముందుకేసి రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలంటూ సమావేశంలో ప్రసంగించడంతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో టికెట్ల పోరు తారాస్థాయికి చేరుకున్నట్లుగా తెలుస్తున్నది.