చండీఘడ్: దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్(E20 petrol) అమ్మకాలపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నట్లు కొన్ని చోట్ల ఫిర్యాదులు అందాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఇథనాల్ ఫ్రీ పెట్రోల్తో పాటు ఈ20 పెట్రోల్ ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారుడికి ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్కు తగినట్లు డిజైన్ లేని వాహనాల్లో దాన్ని వాడడం వల్ల సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ20 వాడకం వల్ల వాహనాల్లో మైలేజీ తగ్గుతుంది కాబట్టి, ఆ సామర్థ్యానికి తగినట్లు ఈ20 పెట్రోల్ రిటేల్ ధరను తగ్గించాలని తీర్మానంలో కోరారు. ఆటోమొబైల్ ఇంజినీర్లు, పెట్రోలియం నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, వినియోగదారుల సంఘాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఓ వ్యక్తిగత కమిటీని ఏర్పాటు చేసి ఇథనాల్ కలిపిన పెట్రోల్పై సమగ్రమైన స్టడీ చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీఎం భగవంత్మాన్ సింగ్ సభలో మాట్లాడుతూ సుమారు 45వేల వాహనాలపై ఈ20 ప్రభావం గురించి స్టడీ చేశారని, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహనాల్లో మైలీజీ తగ్గినట్లు గుర్తించారని, కొన్ని వాహనాలు పాడైనట్లు కూడా ఆయన చెప్పారు. అసలు ఈ20 విషయంలో ప్రధాని మోదీ ఎందుకు పట్టుపట్టారని, ఇదేమీ నితిన్ గడ్కరీ కుమారుడికి లాభం తెచ్చిపెట్టదని, ఎందుకంటే మోదీకి, ఆయనకు మంచి సంబంధాలు లేవని, కేవలం అమెరికా ప్రభుత్వ వత్తిడి వల్లే ఈ20 పెట్రోల్ అమ్మకాలపై కేంద్రం వత్తిడి తెస్తున్నట్లు భగవంత్ మాన్ ఆరోపించారు.
ఇటీవల అమెరికాతో వంద బిలియన్ల డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దానిలో భాగంగా 5 బిలియన్ల లీటర్ల ఇథనాల్ భారత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని భగవంత్మాన్ ఆరోపించారు.