CRPF : ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపిన ఒక జవాన్ ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో జవాన్కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటలకు అసోంలోని, నాగోన్ జిల్లా, కాటిమారిలోని సీఆర్పీఎఫ్ 34 బెటాలియన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నిందితుడిని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (జీడీ) బల్లాని ప్రేమాంబరంగా గుర్తించారు. అతడు ఈ క్యాంపులో విధులు నిర్వహిస్తుండగా, మెయిన్ గేట్ వద్ద ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై నాగోన్ పోలీస్ హెడ్క్వార్టర్స్ డీఎస్పీ పారమిత సర్కార్ మాట్లాడుతూ.. ప్రేమాంబరం ఉన్నట్లుండి తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ విష్ణు ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ రమ్నావాల్ సింగ్ యాదవ్పై కాల్పులు జరపడంతో వారు ఇద్దరూ మరణించారు. అలాగే, గోవింద్ శ్రీపుల్ అనే మరో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కు గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఉన్నతాధికారులు స్థానిక ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. అతడి, ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వవరాలేవీ ఇంకా తెలియరాలేదు. ఇక, ముగ్గురిపై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ప్రేమాంబరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాల్పుల శబ్దం విని అధికారులు అక్కడికి చేరుకునేలోపే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు మరణించారు. అయితే, అతడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది.