National Film Awards | నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఈసారి ఢిల్లీలో కాకుండా గుజరాత్లో చేయబోతుండడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేదిక మార్చడంపై జరుగుతున్న రాజకీయ వివాదంపై ప్రముఖ నటుడు పరేష్ రావల్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్ పాకిస్థాన్లో ఉందా? బంగ్లాదేశ్లో ఉందా? అది మన దేశంలోనే ఒక భాగం కదా. గుజరాత్లో ఈ వేడుక జరిగితే తప్పేంటి? అంటూ విమర్శకులను ఆయన నిలదీశారు. రాజకీయ నాయకుల పని కేవలం ప్రశ్నలు లేవనెత్తడమేనని కొట్టిపారేశారు. రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీలో జరిగినట్లుగానే, ఇలాంటి జాతీయ స్థాయి కార్యక్రమాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ కేరడియాలోని ఏకతా నగర్లో సెప్టెంబర్ 22న జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 72 ఏళ్ల చరిత్రలో ఢిల్లీ వెలుపల ఈ వేడుక జరగడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. 1971లో 17వ జాతీయ అవార్డుల వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా నిలవగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. మమ్ముట్టి (బ్రహ్మయుగం), కార్తీక్ ఆర్యన్ (చందూ చాంపియన్) సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్నారు.