మొయినాబాద్, ఏప్రిల్ 5 : విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర చేశారని.. బీజేపీకి నీచ సంస్కృతి ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్లో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తుంటే వారిలో అభద్రతాభావం పెంచేలా కాషాయం పార్టీ నీచ సంస్కృతికి ఒడిగట్టిందన్నారు. బంగారు భవిష్యత్తును విద్యార్థులకు ఇవ్వాల్సింది పోయి ప్రశాంతంగా పరీక్షలు రాస్తుంటే పరీక్ష పేపర్ లీకేజీ చేయించడానికి బండికి సిగ్గులేదా అని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందని.. అందుకే నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాయకులు జయవంత్, శ్రీహరియాదవ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, యాదగిరిచారి పాల్గొన్నారు.
కొడంగల్ : సీఎం కేసీఆర్ను ఎదుర్కునే దమ్ములేకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరిత రాజకీయాలను ప్రదర్శిస్తున్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం కొడంగల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పార్టీల అధ్యక్షులిద్దరూ దొందు దొందేనని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటడంతో బండి, రేవంత్రెడ్డి ఈ విధమైన చిల్లర రాజకీయాలకు ఒడికడుతున్నట్లు ఆరోపించారు. ఉద్యోగులు, కార్యకర్తలను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని లీకేజీలకు పాల్పడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని బదునాం చేయాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపారు. రెండు పార్టీలకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం సీహెచ్సీ ఆస్పత్రిలో కొనసాగుతున్న డయాలసిస్ సెంటర్ను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, బీఆర్ఎస్ బొంరాస్పేట మండల అధ్యక్షుడు చాంద్పాషా, సర్పంచ్ వెంకట్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, వంశీ, సీసీ వెంకటయ్య,నారాయణరెడ్డి, టీటీ రాములు ఉన్నారు.
– ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి