రంగారెడ్డి, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈనెల 17 లోపుగా పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 కుటుంబాలు ఉండగా.. ప్రజాపాలనలో ప్రజల నుంచి 2,91,470 దరఖాస్తులు వచ్చాయి. 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 2,88,361 దరఖాస్తులు ఉండగా.. 2,61,807 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,53,277 దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను 1,439 మంది ఆపరేటర్ల సాయంతో చేపడుతున్నారు.
ఉపాధి హామీ, సెర్ప్, మండల, రెవెన్యూ, విద్యాశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో పని చేసే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను డేటా ఎంట్రీకి ఎంపిక చేశారు. దరఖాస్తుల కంప్యూటరీకరణకు ఇంకా ఆపరేటర్లు అవసరం పడడంతో ప్రైవేటు వారిని కూడా తీసుకున్నారు. ప్రతి ఆపరేటర్కు ఒక ఐడీ, పాస్వర్డ్ను కేటాయించి పక్కాగా నమోదు చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 4 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. మధ్యలో సంక్రాంతి సెలవులు రావడంతో కొంత బ్రేక్ పడింది. చివరి రెండు రోజుల్లో మరింత వేగవంతంగా ఆన్లైన్ ప్రక్రియను కొనసాగించి టార్గెట్ను పూర్తి చేయాలని అధికారులు సంకల్పిస్తున్నారు.
ప్రభుత్వం ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించగా.. చాలా మంది ఇతర అంశాలపైనా దరఖాస్తు చేశారు. రేషన్ కార్డు, ఇతర వ్యక్తిగత లబ్ధికి సంబంధించి తెల్లకాగితంపై విజ్ఞప్తులు వచ్చాయి. ఈ తరహా దరఖాస్తులు అర్బన్ ఏరియాలో 47,551 దరఖాస్తులు, రూరల్ ఏరియాలో 48,335 దరఖాస్తులు కలిపి మొత్తం 95,886 వచ్చాయి.
అభయ హస్తం దరఖాస్తులను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేస్తుండగా.. ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తుల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వాటిని అధికారులు ఎంట్రీ చేయక పక్కన పెట్టారు. ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేకపోవడం.. ఇతర దరఖాస్తుల వివరాలు నమోదు చేసేందుకు ఓ నమూనా అంటూ ఏదీ లేకపోవడంతో అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. సంబంధిత దరఖాస్తులను ఎప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు? అన్నదానిపై ప్రజల్లో ఎన్నో సందేహాలు నెలకొంటున్నాయి.