మర్పల్లి, నవంబర్ 17 : బీఆర్ఎస్ పాలనలోనే తండాలకు మంచి గుర్తింపు వచ్చిందని, మిషన్ భగీరథతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందని బీఆర్ఎస్ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. శుక్రవారం మండల పరిధిలోని జంషదాపూర్, రాంపూర్, కట్టేపహాడ్ తండాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందటంతో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుంటే పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదుగంటలు మాత్రమే అందిస్తున్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతుల పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తుండగా దాన్ని రూ.16 వేలకు పెంచనున్నట్లు తెలిపారు.
అర్హులైన మహిళలందరికీ నెలకు సౌభాగ్యలక్ష్మి పథకంతో రూ. మూడు వేల జీవన భృతి, ఆసరా పింఛన్లు రూ.ఐదు వేలు, దివ్యాంగుల పింఛన్లను రూ. ఆరు వేలకు పెంచనున్నట్లు తెలి పారు. తెల్ల రెషన్ కార్డు దారులకు సన్నబియ్యం సరఫరా, అర్హులైన పేద మహిళలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల వారు చెప్పే మాటలకు మోసపోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసి రెండోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, ఎంపీపీ లలితారమేశ్, వైస్ ఎంపీపీ మెహన్రెడ్డి, సర్పంచులు నూరొద్దీన్, ఇందిరా అశోక్, కల్పనా శంకర్, ఉప సర్పంచ్ అంజమ్మ, మోహిజ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి రాచయ్య, గ్రామాధ్యక్షుడు అశోక్, షఫీ, సునీల్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పెద్ది అంజయ్య, రవి, రాజు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీ టీసీలు, మండల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.