కడ్తాల్, అక్టోబర్ 7 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని, రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. కడ్తాల్లో సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని శుక్రవారం డీజీపీ అంజనీకుమార్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్వ్రీంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశారని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.585 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను, నేరాల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 64 శాతం కెమెరాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నదని, కడ్తాల్లో నిర్మించిన పోలీస్స్టేషన్ అద్భుతంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న రక్షణ వ్యవస్థ, ప్రస్తుత పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. గతంలో పోలీసులు అంటే ప్రజలకు భయం ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులపై గౌరవం, మర్యాద ఏర్పడిందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఘర్షణలు జరుగుతాయని, లా అండ్ కంట్రోల్ అదుపు తప్పుతుందని కొందరు భయభ్రాంతులకు గురిచేశారని, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఘర్షణ కూడా జరుగలేదన్నారు. గతంలో రాష్ట్రంలో రెండు కమిషనరేట్లు ఉండగా, ప్రభుత్వం వాటిని 9కి పెంచిందని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతో రాష్ర్టానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా షీ టీంలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖలో 17 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఆమనగల్లులో ఏసీపీ కార్యాలయం ఏర్పాటుకు ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి సహకరించిన ఫార్చ్యూన్ బట్టర్ఫ్లై సిటీ ఎండీ, చైర్మన్ శేషగిరిరావు, ఈడీ రమేశ్ను మంత్రి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
మండల కేంద్రంలో ఆధునాతన హంగులతో పోలీస్స్టేషన్ భవనాన్ని నిర్మించినట్లు డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో సోదరభావంతో మెలగాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవంతో ఉండాలన్నారు. పోలీస్స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. కడ్తాల్లో అన్ని హంగులతో పోలీస్స్టేషన్ నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. మన పోలీస్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండి దేశంలోనే ముందంజలో ఉన్నదని వివరించారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి నాలుగు లైన్లుగా మారుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుందని ఎంపీ వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలను కాపాడటానికి పెద్దపీటను వేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోలీసు శాఖకు భారీ బడ్జెట్ను కేటాయించి మరింత బలోపేతం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. రాజధాని అతి చేరువలో ఉన్న కడ్తాల్ మండలం రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుపోనున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫార్మా ఏర్పాటు కానుండడంతో 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఆమనగల్లు వరకు మెట్రో రైలును పొడిగించాలని, ఏసీపీ, ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు.
మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ నిర్మాణానికి సహకరించిన ఫార్చ్యూన్ బట్టర్ఫ్లై సిటీ ఎండీ శేషగిరిరావు, ఈడీ రమేశ్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హోం మంత్రి, డీజీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలను పోలీసు ఉన్నతాధికారులు సత్కరించారు. అంతకుముందు హోంశాఖ మంత్రి, డీజీపీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏడీసీపీ రామ్కుమార్, సీపీ రంగస్వామి, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ లచ్చీరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, తహసీల్దార్ షేక్ ముంతాజ్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ హరిశంకర్గౌడ్, నూతన ఎస్హెచ్వో శివప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.