షాబాద్, ఫిబ్రవరి 19 : గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పారిశుధ్య నిర్వహణ, ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నది. వాటి ప్రయోజనాలను పొందుతున్న ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 61.7శాతం ఇంటి పన్నులు వసూలయ్యాయి. ఈ ఏడాది మార్చి 31లోగా వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను వసూలు లక్ష్యం రూ. 35.95 కోట్లు ఉండగా, ఇప్పటివరకు రూ.22.18 కోట్లు పన్నులను అధికారులు వసూలు చేశారు. మరో రెండు నెలల్లో లక్ష్యాన్ని అధిగమించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు నిత్యం పన్నులను వసూలు చేస్తున్నారు. వసూళ్లలో వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు.
జిల్లాలో పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వందశాతం పన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి పన్నులను రాబడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 40 రోజులు మిగిలి ఉండడంతో అంతలోపు వందశాతం పన్నుల వసూళ్లను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రోజువారీ పన్నుల వసూళ్ల నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూ వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు వేగవంతంగా జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 61.7శాతం పన్నుల వసూలు పూర్తయ్యింది. ఇటీవల తమ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పన్నులు వసూలుపై దిశానిర్దేశం చేశాం. రోజువారి పన్నుల వసూలు టార్గెట్ ఇచ్చాం. ఎక్కడైనా టాక్స్ తక్కువగా ఫిక్స్ చేసి ఉంటే ప్రస్తుత రేట్ ప్రకారం ట్యాక్స్ ఫిక్స్ చేసి వసూలు చేయిస్తున్నాం. ఈ ఏడాది మార్చిలోగా వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నాం.
-సురేశ్ మోహన్, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి