వికారాబాద్, డిసెంబర్ 15 : జిల్లాలో ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్న నర్సరీలన్నింటినీ ప్రభుత్వ స్థలాల్లోకి వారం రోజుల్లో మార్చాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో హరితహారం, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు పెంచేందుకు నాణ్యమైన మట్టితో బ్యాగ్ ఫిల్లింగ్ చేపట్టాలని సూచించారు.
స్థానికంగా దొరికే నాణ్యమైన విత్తనాలను విత్తి 100 శాతం మొక్కలు మొలకెత్తేలా చూడాలన్నారు. ఈ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో తెలంగాణలో క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించిన స్థల సేకరణ పనులను తహసీల్దార్ల సహకారంతో చేపట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
క్రీడా ప్రాంగణాలలో పెరిగన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి అందంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 32 రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి, జాబ్ కార్డు వివరాలు అప్డేట్గా ఉండేలా ఎంపీడీవోలు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. జిల్లాలో మొదటి విడుత మంజూరైన మన ఊరు మన బడి పనులను వేగవంతంగా చేసి పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీఆర్డీవో కృష్ణన్, పాల్గొన్నారు.