‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ఉమ్మడిజిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్తవి, అవసరమైన స్కూళ్లలో అదనపు తరగతి గదులను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మండలాలవారీగా పాఠశాలల భవనాల వివరాలను సేకరించారు. రంగారెడ్డి జిల్లాలో 558 తరగతి గదులను నిర్మించాలని ప్రతిపాదించగా.. దీనికోసం రూ.72.54 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. వీటితోపాటు శిథిలావస్థలో ఉన్న 163 గదులను పునర్నిర్మించాలని నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.
-రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 26, (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో విద్యారంగాభివృద్ధికి ఒక్కో అడుగు పడుతున్నది. సర్కారు బడులకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పించనున్నారు. వచ్చే మూడేండ్ల కాలంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారను న్నాయి. అయితే ముందుగా విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలతోపాటు జిల్లా పరిషత్ పాఠశాలల్లో వసతులను కల్పించనున్నారు. ఇందులో భాగంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, భవనాల మరమ్మతులు, చాక్బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే ఇప్పటివరకు పాఠశాలల్లోని మరుగుదొడ్ల మరమ్మతులు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, కాం పౌండ్ వాల్స్ నిర్మాణం, శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాల వివరాలను మాత్రమే జిల్లాలోని స్థానిక అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు సంబంధించి రూ.200 కోట్ల నిధులు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు నాణ్యమైన ఆంగ్ల మా ధ్యమాన్ని ప్రభుత్వం అందించనున్నది. దీంతో సర్కారు బడు ల్లో చదివే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాణించనున్నారు.
జిల్లాలో 558 అదనపు తరగతులు
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలుచేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులు ఇప్పటికే 40 శాతం వరకు పూర్తయ్యాయి. మరోవైపు జిల్లాలోని మిగతా పాఠశాలల్లో మూడేండ్లలో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నారు. దీంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకోసం రూ.200 కోట్లు అవసరమని ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే వీటిలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా శిథిలావస్థకు చేరిన తరగతి గదుల వివరాలను మండలాల వారీగా జిల్లా విద్యాశాఖ ఇప్పటికే సేకరించింది. ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు ఇచ్చిన వివరాల మేరకు జిల్లాలో కొత్తగా 558 తరగతి గదుల నిర్మాణం అవసరమని ప్రతిపాదించారు. ఈ మేరకు 558 కొత్త తరగతి గదుల నిర్మాణానికి రూ.72.54 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. కొత్త తరగతి గదుల నిర్మాణం అధికంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్నగర్, గండిపేట, హయత్నగర్, శంషాబాద్ మండలాల్లో అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మండలా ల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరినట్లుగా వారు తేల్చారు.
వికారాబాద్ జిల్లాలో శిథిలావస్థలో 163 తరగతి గదులు
పరిగి, జనవరి 26: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడులకు మహర్దశ రానున్నది. సర్కారు బడుల్లో కల్పించనున్న వసతులతో రానున్న మూడేండ్లలో వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అయితే ముందుగా అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వసతులను కల్పించనున్నారు. వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదుల నిర్మాణం చేపట్టనున్నారు. వీటితోపాటు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 163 గదులను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నా రు. జిల్లా పరిధిలో 764 ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత పాఠశాలలు, 174 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 92 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవని అధికారులు ఇప్పటికే గుర్తించి వాటి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటితోపాటు అనేక ఏండ్ల క్రితం నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరాయి. వాటిని కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది అధిక విద్యార్థులున్న 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసి ఆ బడుల్లో వసతులు కల్పించనున్నారు. జిల్లాలో జడ్పీహెచ్ఎస్లు 170 ఉండగా అందులో 200 మందికిపైగా విద్యార్థులున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 71 ఉన్నాయి. 173 ప్రాథమికోన్నత పాఠశాలలుండ గా వాటిలో 110 మందికిపైగా విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 50 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 712 ఉండగా అందులో 50 మందికిపైగా విద్యార్థులున్నవి 300 ఉన్నాయి.
శిథిలావస్థలో 163 తరగతి గదులు
జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1216 అదనపు తరగతి గదులు అవసరమని అధికారులు గుర్తించారు. తాండూరు నియోజకవర్గంలోని పాఠశాలల్లో 324 గదులు, పరిగిలో 265 గదులు, వికారాబాద్లో 301 గదులు, కొడంగల్లో 292 గదులు, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలంలో 34 అదనపు తరగతి గదులు అవసరమని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. వీటికితోడు జిల్లాలోని పాఠశాలల్లో 163 తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటి ఫొటోలను సైతం ఎస్ఐఎస్ యాప్లో అధికారులు అప్లోడ్ చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు ఈ తరగతి గదులు అనుకూలంగా లేవు. ఎప్పుడైనా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కూల్చివేయాలంటే ముందుగా ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి కూల్చివేతకు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వా త ఆయా గ్రామపంచాయతీల ద్వారా శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి పంచాయతీ అధికారులు శిథిలావస్థకు చేరిన గదుల జాబితాను ఇవ్వాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు కోరా రు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.
ఎస్ఎంసీలకే పర్యవేక్షణ బాధ్యత
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టే పనులను పర్యవేక్షించే బాధ్యతను ఎస్ఎంసీలకే అధికారులు అప్పగించారు. ఎస్ఎంసీలు సిద్ధంగా లేనిచో ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయనున్నారు. అంచనాలు తయారు చేసిన తర్వాత మొత్తం వ్యయంలో 15శాతం నిధులు ఎస్ఎంసీలకు రివాల్వింగ్ ఫండ్గా కేటాయిస్తారు. ఈ నిధుల్లో మూడోవంతు నిధులను వినియోగించిన వెంటనే ఖర్చు చేసిన మొత్తాన్ని ఎస్ఎంసీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వా మ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.10 లక్షల వరకు విరాళంగా అందజేసిన వారి పేరు, లేదంటే వారు సూచించిన పేరు పాఠశాలకు లేదా తరగతి గదికి పెడతారు. రూ.2 లక్షలు, అంతకుమించి విరాళంగా అందజేసిన వారికి ఎస్ఎంసీలో సభ్యుడిగా అవకాశం ఇస్తారు. ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు, దాతల నుంచి నిధులను సమీకరిస్తారు. పాఠశాలల్లో చేపట్టే పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్, ఎస్ఎస్ఏ, ఆర్అండ్బీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇం జినీరింగ్ విభాగాలు చూస్తాయి. ఏదిఏమైనా మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సదుపాయాలు చాలావరకు మెరుగుపడనున్నాయి.
బడులు మరింత బలోపేతం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కార్ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించడం శుభపరిణామం. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఏండ్ల తరబడిగా అభివృద్ధికి నోచుకోని పాఠశాలలకు మహర్దశ రానున్నది. గ్రామాల్లోని పేద విద్యార్థులకు కూడా ఆంగ్ల మాధ్యమం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి.
సూద యాదయ్య, హైతాబాద్(షాబాద్)
సర్కార్ బడులకు మంచి రోజులు
గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి రావడం శుభపరిణామం. ప్రభు త్వం అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనుండటంతో శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్తవి ఏర్పాటు కానున్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
చదువులు సాఫీగా..
పేద పిల్లల భవిష్యత్కు సీఎం కేసీఆర్ ప్రభు త్వం కృషి చేస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినది. దీంతో రానున్న మూడేండ్లలో సర్కారు బడుల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. దీంతో విద్యార్థుల చదువు సాఫీగా సాగే అవకాశం ఉంది.
రేగడిమైల్వార్, బొంరాస్పేట
సౌకర్యాల మెరుగు..
ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు మెరుగుపడనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ తమ పిల్లలను సర్కారు బడులకు పంపిస్తారు. పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అందడం అభినందనీయం.