ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 19 : మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. ప్రతిఏటా మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నది. గొర్రెలు, మేకలకు సోకే వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న 7.26లక్షల గొర్రెలు, 1.84లక్షల మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ టీకాల పంపిణీకి జిల్లా వ్యాప్తంగా 54టీంలను నియమించింది. ఈ టీంలు ప్రతిరోజూ 54గ్రామాల చొప్పున గొర్రెలు, మేకలకు నివారణ టీకాలను వేయనున్నారు. ఈ టీకాల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 నుంచి ప్రారంభమై ఈనెల 28వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 54టీంలు..
గొర్రెలు, మేకలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 22 నుంచి జిల్లా వ్యాప్తంగా నట్టల నివారణ టీకాలను పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలలో అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 7.26లక్షల గొర్రెలు, 1.84లక్షల మేకలకు నట్టల మందులను వేసేందుకు 54టీంలను ప్రభుత్వం నియమించింది. ఈ టీంలు ప్రతిరోజూ 54గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
నట్టల వ్యాప్తి..
మూగజీవాల్లో అంతర పరాన్న జీవులను నివారిస్తే వాటి పెరుగుదల వేగంగా సాగుతుంది. జలగలు, బద్దె పురుగులు, నత్తగుల్లలు ముఖ్యమైనవి. ఇవి కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో చేరి అక్కడే అంటిపెట్టుకుని రక్తాన్ని పీల్చటం వల్ల రక్తహీనతకు గురవుతాయి. తద్వారా రోగ నిరోధకశక్తి తగ్గిపోవడంతో బలహీనంగా మారి వ్యాధులకు గురవుతాయని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. గొర్రెలు నిల్వ ఉండే నీటిని తాగటం వలన జలగలు కడుపులోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బద్దె పురుగులు పచ్చిక బయళ్లతో గడ్డిని తినడం ద్వారా దానిపై ఉండేవి కడుపులోకి వెళ్లి వ్యాధులకు కారణమయ్యే అవకాశమున్నందున రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. రైతులు తమ మూగజీవాలను అటవీప్రాంతాలకు తరలించే క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే వెంటనే నివారించవచ్చును.
వ్యాధి లక్షణాలు..
నివారణ చర్యలు..
ఏటా నట్టల నివారణ మందులను గొర్రెలు,మేకలకు తప్పనిసరిగా వేయించాలి. జీవాలకు వ్యాధి సోకిన వెంటనే మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి సోకినప్పుడు యాంటిబయోటెక్ ఇంజెక్షన్లు వైద్యాధికారుల సూచనల మేరకు ఇప్పించాలి. ముఖ్యంగా వ్యాధి సోకిన గొర్రెలను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. ప్రభుత్వం ప్రతిఏటా ఉచితంగా అందజేస్తున్న నట్టల నివారణ మందులు వేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు గొర్రెలు, మేకలకు దరికి చేరవని వైద్యాధికారులు అంటున్నారు.
మేకకు నట్టల నివారణ మందులు వేస్తున్న పశువైద్యాధికారులు (ఫైల్)
పశువైద్యాధికారులకు రైతులు సహకరించాలి
గొర్రెలు, మేకలకు సోకే నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నది. నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు, కాపరులు సహకరించాలి. టీకాలు వేయించటం ద్వారా గొర్రెలు, మేకలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
– అంజిలప్ప, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి