బొంరాస్పేట, ఏప్రిల్ 22 : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో కూలీలకు పనులు చేయడానికి గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. దీంతో ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున కూలీలు తరలివస్తున్నారు. వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. అధికారులు గుర్తించిన పనులను చేపట్టి ఎక్కువ మంది కూలీలు పాల్గొనే విధంగా కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా వచ్చేది వర్షాకాలం కావడంతో నీటి నిల్వ పనులకు, మట్టి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మండలంలోని 34 చెరువులు, కుంటల్లో ఒండ్రుమట్టి తొలగించే పనులు, మూడు గ్రామాల్లో పాటు కాల్వల్లో పూడిక తొలగించే పనులు, నాలుగు గ్రామాల్లో భూముల లేవలింగ్ పనులు, కొత్తూరు, నాగిరెడ్డిపల్లి, వడిచెర్ల గ్రామాల్లోని గుట్ట ప్రాంతాల్లో కందకాల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. చెరువుల్లోని మట్టిని రైతుల పొలాలకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.
దీనివల్ల పొలాలు సారవంతమవుతాయి. చెరువులు, కుంటల్లో లోతుతో పాటు నీటినిల్వ సామర్థ్యం పెరిగి రైతుల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. చేపట్టేవన్నీ మట్టి పనులే కావడంతో ఎక్కువ మంది కూలీలు పనులకు వస్తున్నారు. మండలంలో రోజూ 5500 మంది కూలీలు ఉపాధిహామీ పను ల్లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఉపాధి పనులు చేసే కూలీలకు ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి దినసరి కూలీని రూ.300లకు పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పనులు చేసే కూలీలకు రూ.230ల నుంచి రూ.280ల వరకు కూలీ వస్తుంది.
ఉపాధిహామీ పనులు చేసిన కూలీలకు రెగ్యులర్గా కూలీ చెల్లింపు సమస్యగా మారింది. నెల నుంచి రెండు నెలల వరకు కూలీ కోసం ఆగాల్సి వస్తుంది. దీంతో కూలి పనులపైనే ఆధారపడి జీవించే పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన కూలీ బకాయిలు చెల్లించారు. అధికారులు స్పందించి వెంట వెంటనే కూలీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.