రంగారెడ్డి, మార్చి 28(నమస్తే తెలంగాణ): అవార్డులు రావడం అంటే ఆషామాషీ కాదని, ప్రభుత్వం ముందుచూపుతో చేపడుతున్న సుపరిపాలన వల్లనే సాధ్యమైందని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన పాలక వర్గాలకు అవార్డులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విస్తృతంగా నిధులు కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో మన పల్లెలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరిన్ని అవార్డులు వరించేలా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సుపరిపాలనతోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ర్టానికి జాతీయ అవార్డుల పంట పండుతోందన్నారు. ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా అమలు చేస్తుండటం వల్ల తెలంగాణలోని గ్రామ పంచాయతీలు స్వపరిపాలనలో ముందంజలో ఉన్నాయని తెలిపారు.
ఎంపిక చేసిన తొమ్మిది అంశాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు మంత్రి అవార్డులు అందజేశారు. 2021 – 22 సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో తెలంగాణలోనే 19 గ్రామాలు ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కేటగిరీలోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలించిందని, ఉత్తమ జిల్లాల కేటగిరిలో జగిత్యాల మొదటి స్థానం, నిజామాబాద్ జిల్లా మూడో స్థానాన్ని దక్కించుకొని అవార్డులను కైవసం చేసుకున్నాయన్నారు. 2022లో సుజలాం కేటగిరి -1లో తెలంగాణకు మూడో ర్యాంకు వచ్చిందని, సుజలాం కేటగిరి-2లో కూడా మరో మారు తెలంగాణ రాష్ట్రం ద్వితీయ ర్యాంకును దక్కించుకోవడం విశేషమన్నారు. ఇదే కోవలో ప్లాస్టిక్ మేనేజ్మెంట్లో తెలంగాణ మొదటి ర్యాంకును దక్కించుకున్నదని, నీటి యాజమాన్యం కేటగిరిలోనూ సౌత్ జోన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నెం:1గా నిలిచిందని తెలిపారు.
సుపరిపాలనతో అవార్డుల పంట..
ప్రభుత్వం ముందు చూపుతో చేపడుతున్న నిర్దిష్ట కార్యక్రమాలతో గ్రామాలను సుపరిపాలన దిశగా ముందు వరసలో నిలుపుతుండటం వల్లే అవార్డులు దక్కాయని స్పష్టం చేశారు. ఇది వరకు కేంద్రం గ్రామ పంచాయతీలకు అందించే నిధులు జీపీల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలకే సరిపోయేవని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, కేంద్రం అందిస్తున్న నిధులకు అధిక మొత్తంలో స్టేట్ ఫైనాన్స్ ద్వారా జీపీలకు నిధులు సమకూరుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రూ. 256 కోట్ల చొప్పున గడిచిన మూడున్నరేండ్లలో సుమారు రూ.11వేల కోట్లను జీపీలకు అదనంగా అందించిందన్నారు. దీని వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగయ్యాయని అన్నారు. అదనపు నిధులకు తోడు మిషన్ భగీరథ, హరితహారం, పచ్చదనం – పరిశుభ్రత, ఆసరా పథకం కింద పెద్ద మొత్తంలో పెన్షన్లను పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు సైతం అవార్డులు రావడానికి దోహదపడుతున్నాయని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో కొత్త శోభ : కలెక్టర్ హరీశ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం ఎంతగానో మార్పు సంతరించుకున్నదని కలెక్టర్ హరీశ్ అన్నారు. ఐదు విడుతలుగా అమలైన పల్లె ప్రగతి కార్యక్రమాల ఫలితంగా గ్రామ పంచాయతీలు పచ్చదనం – పరిశుభ్రతతో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, ట్రాక్టర్ వంటి వనరులు, సదుపాయాలు సమకూరాయని గుర్తు చేశారు. పంచాయతీలే నర్సరీలను నిర్వహిస్తూ, తమకు అవసరమైన మొక్కలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ప్రభాకర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర భేష్ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా మంత్రి సబితారెడ్డి హాజరై ప్రసంగించారు. జిల్లాలో ‘మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించలేదన్నారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభ్యున్నతి సాధించాలని వారు పిలుపునిచ్చారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ మహిళల ప్రభావం ఒకింత ఎక్కువగా ఉంటుందని, తమ పిల్లల పట్ల ఆడ, మగ అనే భేదం చూపకుండా బాలికలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని హితవు పలికారు. పోటీతత్వంతో కూడిన నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా ఉద్యోగులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, మహిళా స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ విశాల, సంక్షేమ శాఖ అధికారి మోతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
ద్రాక్ష సాగుపై అవగాహన కల్పిస్తాం..
జిల్లాలో 2008 వరకు పండ్ల తోటలు అధికంగా ఉండేవి. పలు రకాల పండ్ల సాగు విపరీతంగా కొనసాగేది. రాను రానూ నగర అభివృద్ధిలో భూముల్లో కమతాలు ఏర్పడి, రియల్ భూమ్ వచ్చి పండ్ల తోటల సాగు పక్కకు పడిపోయింది. గతంలో ఐదు వేల ఎకరాల వరకు పండ్ల తోటల సాగు కొనసాగేది. ప్రస్తుతం 132 ఎకరాల్లో ద్రాక్ష సాగు కొనసాగుతున్నది. రోజు రోజుకూ ద్రాక్ష పంటల సాగు పడిపోతున్నది. పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. వరి సాగు కంటే ద్రాక్ష సాగుకు నీటి వినియోగం చాలా తక్కువ. ద్రాక్ష పంటలకు పెట్టుబడి ఎక్కువైతే, ప్రతిఫలం కూడా రెండింతలు అధికమవుతున్నది. చిన్న కమతాలైనా ఫరవాలేదు. రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తే సలహాలు, సూచనలు ఇచ్చి అవగాహన కల్పించేందుకు మా విభాగం సిద్ధంగా ఉంది. ఈ పంట ఒక్కసారి విత్తితే, 20 ఏండ్ల వరకు తీసివేసే పనేలేదు. ఆసక్తి గల, ఔత్సాహిక రైతులు ముందుకు రావాలి.
– సునందారాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి, రంగారెడ్డి జిల్లా
దిగుబడి అధికం..
గత పదమూడేండ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఏడెకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేశాను. ఈ పంటను ఒక ప్రణాళిక ప్రకారం సాగు చేస్తే దిగుబడి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. గతంలో థామస్, ఎస్ఎస్ లాంటి రకాలను పండించా. ఇప్పుడు మాణిక్ చమన్ (గింజ లేని ద్రాక్ష) పంటను వేశా. ఒక్కో మొక్క 20 నుంచి 25 కేజీల దిగుబడిని ఇస్తున్నదని ఆశిస్తున్నా. ఎకరాకు దాదాపు 20 మెట్రిక్ టన్నులపైనే దిగుబడి వస్తున్నదని అనుకుంటున్నా. తోట దగ్గర నుంచే అమ్మకాలు ప్రారంభిస్తున్నా. రాబడి సైతం ఆశాజనంగా ఉంటుంది.
– కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడ
హార్టికల్చర్ వైపు ఆసక్తి చూపాలి
జిల్లాలో ఉద్యాన వన (హార్టికల్చర్) పంటల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, హార్టికల్చర్ విభాగాన్ని పురోగమనం దిశగా మార్చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ద్రాక్ష తోటల సాగులో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమంగా నిలుస్తున్న రైతు తుక్కుగూడ వాసి, కొమ్మిరెడ్డి అంజిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏడు ఎకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు చేరుకున్నది. మంత్రి సబితారెడ్డి ద్రాక్ష పంట కోతను ప్రారంభించారు. అనంతరం, రైతు కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ శాఖ అధికారి సునందా రాణితో ద్రాక్ష పంట సాగుపై చర్చించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే పండ్లు, పూలు, కూరగాయల తోటలు అధికంగా వేసేవారని తెలిపారు. ద్రాక్ష సాగు అనేది లక్షలాది రూపాయల పెట్టుబడితో ముడిపడి ఉన్న పంట, అని చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపడం లేదని మంత్రి పేర్కొన్నారు.
చిన్న చిన్న కమతాలలోనూ ఈ పంటను అద్భుతంగా పండించవచ్చన్నారు. ఇది ఆరుతడి పంట అయినందున నీటి వినియోగం సైతం పెద్దగా ఉండదని, మిగతా పంటలతో పోల్చితే పంట సాగుకు ఖర్చు ఎక్కువైనప్పటికీ లాభాలు కూడా అధికంగా ఉంటాయని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో హార్టికల్చర్ను అభివృద్ధి చేయాలని, భిన్నమైన పంటలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా భూములు అన్ని పంటల సాగుకు అనుకూలమైనవని, ఇక్కడి వాతావరణం సైతం పంటల అభివృద్ధికి తోడ్పాటును ఇస్తున్నదని మంత్రి తెలిపారు. ఇలాంటి పంటలపై చిన్న సన్నకారు రైతులు మొగ్గు చూపేందుకు ప్రభుత్వ పరంగా సూచనలు, సలహాలు ఇస్తుందన్నారు. సబ్సిడీ పరంగా ముఖ్యమంత్రి సమక్షానికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు. తోటల సాగులో భిన్నమైన, లాభదాయకమైన పంటలనే ఎంచుకోవాలని మంత్రి సబితా రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అప్పారావు, జిల్లా హార్టికల్చర్ విభాగం అధికారులు, సిబ్బంది, పలువురు రైతులు, స్థానికులు పాల్గొన్నారు.