రంగారెడ్డి , ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఇటీవలే సభ నిర్వహణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణభవన్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశాన్ని నిర్వహించి ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో బహిరంగ సభకు తరలివెళ్లేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నిర్వహించిన అనేక సభలు, సమావేశాల్లో ఆయన ప్రసంగం అందరికీ ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం కేసీఆర్ నల్లగొండ సభలో పార్టీ శ్రేణులకు ఇచ్చే సంకేతాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పరాధీనం చేయడంపైనే కేసీఆర్ ప్రసంగం ఉండనున్నది.
కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తద్వారా తెలంగాణ ప్రయోజనాలకు కలగనున్న భంగం తదితర అంశాలను ఈ సభలో కేసీఆర్ ఎండగట్టనున్నారు. జిల్లాకు ప్రయోజనం చేకూర్చే రంగారెడ్డి-ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టిన కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోవు రోజుల్లో సాగు, తాగునీటికి ఏర్పడనున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ఏది ఏమైనా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నల్లగొండ సభపైనే చర్చ జరుగుతున్నది.
కేసీఆర్ నేతృత్వంలో నేడు నల్లగొండలో జరుగనున్న సభలో జిల్లాకు చెందిన తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీచైర్పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నారు. బస్సు లు, డీసీఎంలు, కార్లు తదితర వాహనాల్లో పెద్ద ఎత్తున జిల్లా ప్రజానీకం తరలివెళ్లేలా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా రైతాంగం సభలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ చెప్పగలిగిందని, రైతులకు ఎవరు మేలు చేస్తున్నారో! ఎవరు కీడు చేస్తున్నారో! ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. నల్లగొండ సభ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ను నింపి మున్ముందు చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణకు గొప్ప ప్రేరణను ఇస్తుందన్న ఆశాభావాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. పదేండ్ల బీ ఆర్ఎస్ పాలనలో సాగునీటి హక్కులను కాపాడగా.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 80శాతం పూర్తైన పాల మూ రు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
సాగునీటి హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. నేడు నల్లగొండలో జరుగనున్న భారీ బహిరంగసభకు ప్రతి గ్రామం నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చేలా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 80 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 20 ఆర్టీసీ బస్సుల్లో ఆరువేలకు పైగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తరలివెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్గౌడ్ తదితర నాయకులు వంద కార్లలో సభకు తరలివెళ్లనున్నారు.