మూసీ సుందరీకరణ… కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కారు శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ (మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం డ్రోన్ సర్వే చేయగా… ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూసీ పొడవునా ఉన్న గ్రామ నక్షాల (విలేజ్ రెవెన్యూ మ్యాప్లు) ఆధారంగా హద్దులను నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల్లో సంబంధిత కన్సల్టెన్సీలతో సమావేశమై.. హద్దుల నిర్ధారణ ప్రక్రియ ఎలా నిర్వహించాలనే దానిపై విధానాన్ని రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే మూసీ పొడవున ఏయే ప్రదేశంలో ఎంతమేర సుందరీకరణ, వినోద, వాణిజ్య అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది? అనే అంశాలపై స్పష్టత వస్తుంది. ఈ ప్రాజెక్టుపై రూ.58వేల కోట్ల వరకు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసుకుంది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్లోని అనంతగిరి అడవుల్లో పుట్టి… హైదరాబాద్ మహా నగరంలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీని సబర్మతి తరహాలో సుందరీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. అయితే మూసీలోకి మురుగు నిలువరిస్తే తప్ప సుందరీకరణ సాధ్యంకాదని నిపుణులు స్పష్టం చేశారు. మూసీలోకి రోజుకు సుమారు 1800 మిలియన్ లీటర్ల మురుగు కలుస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు రోజుకు 700 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేసే ఎస్టీపీలు ఉన్నందున… మిగిలిన 1100 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
సుమారు రూ.3,820 కోట్లతో 38 వరకు ఎస్టీపీలను చేపట్టగా పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం వంద శాతం మురుగును శుద్ధి చేస్తున్న ఏకైక నగరంగా గుర్తింపును సాధించనుంది. దీంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)లో మురుగును మళ్లించే పనులు చేపట్టింది. దీంతో సుందీరకరణకు మార్గం సుగమం అయింది. మూసీపై ఉత్తర-దక్షిణ భాగాలను కలిపేలా 14 బ్రిడ్జీల నిర్మాణంతో సహా నదికి అనుగుణంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్ రహదారికి డిజైన్లు రూపొందించడం, కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించి నదిని శుభ్రమైన నీటితో నింపడం వంటి ప్రణాళికలు తయారు చేసింది.
తాజాగా రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణపై ప్రత్యేక దృష్టిసారించింది. థేమ్స్ నది తరహాలో ఈ నదిని సుందీరకరించి, నది పొడవునా వాణిజ్య, వినోద కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఏకంగా రూ.58వేల కోట్ల ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నది. ఇందుకోసం సీఎం సహా అధికారులు థేమ్స్ పర్యటన పూర్తి చేసి, ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు.
తాజాగా నగరంలో నది పరివాహక సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో ప్రవాహాలు ఎలా ఉన్నాయనే దానిపై (హైడ్రాలజీ స్టడీ) అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. అయితే నగరంలో ఎక్కడెక్కడ నది వెడల్పు ఎంత ఉండాలని నిర్ధారించేందుకు దేనిని ప్రామాణికంగా తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది.
ఇందుకుగాను గ్రామ నక్షాల (విలేజ్ రెవిన్యూ మ్యాప్లు) ఆధారంగానే దీనిని నిర్ధారిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇదే ప్రామాణికమైతే నగరంలోని 56 కిలోమీటర్ల మేర రెండువైపులా పెద్ద ఎత్తున ఆక్రమణలతో నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించడం, అవసరమైతే ఎంఆర్డీసీఎల్ తరపున భూసేకరణ చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ఆక్రమణల తొలగింపు అంటే న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశాలుంటాయిగానీ ప్రభుత్వపరంగా భూసేకరణ చేపట్టినట్లయితే న్యాయపరమైన చిక్కులేవీ ఉండవనేది వ్యూహంగా కనిపిస్తున్నది.
మూడు నెలల్లో హద్దుల నిర్ధారణ, రానున్న తొమ్మిది నెలల్లో రూ.58వేల కోట్ల అంచనాల మేర చేపట్టే పనులపై సమగ్ర నివేదిక పూర్తవుతుందని అధికారి ఒకరు తెలిపారు. ఈలోగా మూసీ పొడవున రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలనేది అధికారులు మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. ఇది పూర్తి కాగానే దానికి అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు పనులను కూడా మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఒక్కసారి రవాణా వ్యవస్థ పూర్తయితే వాణిజ్య, వినోద రంగాల అభివృద్ధి అనేది శరవేగంగా సాగుతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది.