కందుకూరు. ఏప్రిల్ 18 : పంటలు ఎండుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు ప్రశ్నించారు. గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సురుసాని రాజశేఖర్రెడ్డి, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, కాకి రాములు మాట్లాడారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో బోర్లలో నీటి మట్టం తగ్గి పంటలు ఎండుతున్నాయని దీంతో స్టాటర్లు కాలి పోతున్నాయని అన్నారు. వ్యవసాయానికి 18గంటలు. గృహ అవసరాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఏఈ రమేశ్గౌడ్ తెలిపారు.
వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓ సరిత పేర్కొన్నారు. ప్రసవం సమయంలో కేసీఆర్ కిట్లు ఇస్తున్నారా.. అమ్మాయి పుడితే రూ. 13వేలు, అబ్బాయి జన్మిస్తే రూ.12వేలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలను ఇవ్వాలని జాప్యం చేయకూడదని ఎంపీడీఓ సరిత తెలిపారు.
తాగునీటి పై జరిగిన చర్చలో సభ్యులు రాజశేఖర్రెడ్డి, ఇందిరమ్మ దేవేందర్, రాములు, యాదయ్య, ఎల్లారెడ్డి, పద్మ పాడు, సురేశ్, మల్లేశ్ మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, పలు గ్రామాల్లో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారని తెలిపారు. తాగునీటి పై ఆందోళన వద్దని మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు డీఈఈ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రెండు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సరిత ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉన్నందును ఎలాంటి తీర్మానాలు లేకుండా సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.