షాద్నగర్, మే 2 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బడేబాయ్, చోటేబాయ్ కలిసి ఎన్నికల ఆంక్షల పేరుతో ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ ఎన్నికల షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం షాద్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ రోడ్షోలకు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజలంతా ఆయన వైపే ఉన్నారని.. అక్కడికి వస్తున్న లక్షల మందిని చూస్తేనే తెలుస్తున్నదన్నారు.
పీసీసీ హోదాలో వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో కేంద్రంలోని బడేబాయ్తో కలిసి చోటేబాయ్ కుట్ర పన్ని కేసీఆర్ రోడ్షోలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలో తెలియక కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆరోపించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. గ్రామాల్లో ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంటే.. బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డిపై ఓటుకు నోటు కేసు వేళ్లాడుతున్నదని.. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రధాని మోదీతో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డి ఎప్పుడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని.. అప్పటి ఆంధ్ర నాయకులతో కలిసి ఉద్యమకారులపై తుపాకీని ఎక్కుపెట్టారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్లు రిజర్వేషన్లపై చేస్తున్న రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి రెండు జాతీయ పార్టీలు చేసిందేమీలేదన్నారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తోనే సాధ్యమన్నారు.
అందువల్ల మహబూబ్నగర్ ఎంపీగా మరోసారి కేసీఆర్ బలపర్చిన మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మన్నె శ్రీనివాస్రెడ్డి కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని.. ఎంపీ నిధులతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. సీమాంధ్రులకు హారతులు పట్టిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు ప్రజలు ఓటు వేయరని.. పాలమూరును పట్టించుకోని సీఎం రేవంత్రెడ్డి, చల్లా వంశీచంద్రెడ్డిలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి చేస్తున్న ప్రచారానికి అన్ని ప్రాంతాల్లోనూ అపూర్వ స్పందన వస్తున్నదని.. ఆయన మరోసారి ఘన విజయం సాధిస్తారని తెలిపారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.