వికారాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పోటీనే కాదు అనుకున్న కాంగ్రెస్, బీజేపీలకు షాకిస్తూ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జిల్లా నుంచే ఉద్యమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే బీసీ వాదాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ ఉద్యమ నేతను బరిలోకి దింపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సుపరిచితులు, బీసీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
అంతేకాకుండా బీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలతో బీసీలంతా ఏకమవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీ ఉద్యమ నేత కాసానిని గెలిపించుకోవడమే లక్ష్యంగా బీసీలు ముందుండి నడుస్తున్నారు. జిల్లాలోని అన్ని కుల సంఘాలు ఒక్కటై బీసీ వాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. ఊరూరా అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా సమావేశాలు నిర్వహించుకుంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసానిని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి బీసీల సత్తా ఏందో చూపిస్తామని బీసీ కుల సంఘాలు సవాల్ విసురుతున్నారు. మరోవైపు బీసీ వాదంతో జిల్లాలోని బీసీలంతా కాసానికి జై కొడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. ఏదేమైనా బీసీ వాదం జిల్లా అంతటా బలంగా వినిపిస్తున్న దృష్ట్యా కాసాని గెలుపు ఖాయమనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
జిల్లాలో మెజార్టీ ఓట్లు బీసీలే..
జిల్లాలో మెజార్టీ ఓట్లు బీసీ ఓటర్లు ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో లక్షకుపైగా బీసీ ఓటర్లుండడం గమనార్హం. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 8 లక్షల వరకు ఉండగా, వీరిలో దాదాపు 5 లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేలకుపైగా ఒక్క ముదిరాజ్ ఓటు బ్యాంకు ఉండడం గమనార్హం. రాష్ట్రంలోనే పరిగి నియోజకవర్గంలో అత్యధికంగా 65-70 వేల వరకు ముదిరాజ్ ఓటర్లున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. మెజార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించుకునేందుకు బీసీలంతా ఏకమవుతుంటే, బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజెపీలు కుట్ర చేస్తున్నాయి. బీసీవాదం క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోవడంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల కుట్రలు సాగవని బీసీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఓటర్లుగా ఉన్న బీసీల్లో చీలిక తెస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెబుతామంటున్నారు. అయితే మెజార్టీ ఓట్లున్న బీసీలు బీఆర్ఎస్కు మద్దతిస్తే చాలు కాసాని భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని వినిపిస్తుంది.
బీసీలంతా కాసానివైపే..
ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితుడు, బీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాసాని జ్ఞానేశ్వర్వైపే జిల్లాలోని బీసీలంతా నిలుస్తున్నారు. కాసాని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ అన్ని బీసీ సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా ప్రజలకు కాసాని దగ్గరయ్యారు. ఎవరు అడిగినా కాదనకుండా సహాయం అందించిన వ్యక్తి కావడంతో అన్ని పార్టీల్లోని బీసీలు ఐక్యమవుతున్నారు. కాసానికి ప్రత్యేకంగా పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఉన్న అనుచరులు, బీసీ ముఖ్య నాయకులు బీసీ వాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు.