ఇబ్రహీంపట్నం, నవంబర్ 11: రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్లైన్ వేదికగా ఓటరు నమోదుకు అవకాశం ఉండగా.. ఆన్లైన్ ద్వారా ఈ నెల 23 వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకా శం కల్పించింది. కాగా నవంబర్ 7వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను ఈ నెల 23న అధికారులు ప్రకటించనున్నారు. ఈ జాబితాలో చేరికలు, తొలగింపుల కోసం డిసెంబర్ 10 వరకు తుది గడువు విధించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ప్రభుత్వ హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులతోపాటు ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు కూడా ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తులు..
2016 నవంబర్ నుంచి 2022 నవంబర్ వరకు ప్రభుత్వ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు.. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లకు ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశాన్ని అధి కారులు కల్పించారు. వీరిలో చాలామంది ఇప్పటికే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, హైస్కూళ్లలో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఆ యా సంస్థలు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించే వారికి.. వేతనంలో ఈపీఎఫ్ డిడక్షన్ అయ్యే వారికి మాత్రమే ఓటు హక్కును నమోదు చేసుకునే అవకా శం కల్పించారు. ఈ నిబంధనలకు లోబడి ఉన్న అ ర్హుల్లో ఇప్పటికే 4,115 మంది జిల్లాలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా గడువులోపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు,అధ్యాపకులను చేర్పించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.
ఈ నెల 23న తుది జాబితా
జిల్లాలో ఈ నెల 7వ తేదీ వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి తుది జాబితాను ఎన్నికల కమిషన్ 23వ తేదీన ప్రకటించనున్నది. ఈ జాబితాలో చేర్పులు, మార్పులతోపాటు తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న ఓటర్ల వివరాలను సైతం ఈ జాబితాలో అదనంగా చేర్చనున్నారు.
అర్హులూ.. దరఖాస్తు చేసుకోవాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 23 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ నేత