షాబాద్, మార్చి 1: షాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి రాజేందర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారం రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
క్రికెట్లో మొదటి బహుమతి చందనవెల్లి కేపీఆర్ జట్టుకు రూ.75వేల నగదు, జ్ఞాపిక, ద్వితీయ బహుమతి హైదరాబాద్ మస్కతి జట్టుకు రూ.50వేల నగదు, జ్ఞాపిక, వాలీబాల్లో మొదటి బహుమతి అంతారం జట్టుకు రూ.25వేల నగదు, జ్ఞాపిక, ద్వితీయ బహుమతి కుమ్మరిగూడ జట్టుకు రూ.15వేలు, మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ… శంషాబాద్ ఏయిర్పోర్ట్కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. చేవెళ్ల గడ్డపై రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఘనత దివంగత రాజేందర్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన కలలను నిజం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తన నిధులతో పాటు జిల్లా పరిషత్ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. స్టేడియంలో ఉన్న రాళ్ల గుట్టను తొలగించడానికి నిధులు కావాలని అడిగారని, తప్పనిసరిగా నిధులు అందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మహిళలకు కూడా క్రీడలు నిర్వహిస్తామని, తాండూరులో 17వ అంతర్జాతీయ క్రీడలు పెట్టడంతో దేశమంతట నుంచి మహిళలు, బాలికలు వచ్చి క్రీడల్లో పాల్గొన్నారని, ఇక్కడ కూడా అవకాశం ఉంటే అలాంటి క్రీడాపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేసిన రాజేందర్రెడ్డి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పారు.
జిల్లా పరిషత్ నుంచి షాబాద్ మండలానికి అత్యధికంగా నిధులు ఇచ్చినట్లు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. షాబాద్ మండలానికి ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు రాజేందర్రెడ్డి అని చెప్పారు. గతంలో ఏ గ్రామానికి కూడా రోడ్డు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి దగ్గరుండి అధికారులతో మాట్లాడి రోడ్లు, విద్యుత్ సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకురావడంతో నాడు లక్షల్లో ఉన్న భూములు ధరలు నేడు కోట్లలోకి వెళ్లిపోయాయన్నారు.
జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాపోటీలతో గ్రామాల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడుతాయని తెలిపారు. తన తండ్రి దివంగత రాజేందర్రెడ్డి పేరుపై ప్రతి ఏడాది జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఆర్ఆర్ స్టేడియం చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, క్రీడల నిర్వాహకులు మహేశ్యాదవ్, రమేశ్యాదవ్, ధనుంజయ్, మాజీ జడ్పీటీసీలు కోట్ల మహేందర్రెడ్డి, రాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శేరిగూడెం వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, పి.నర్సింహారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్పాషా, బీఆర్ఎస్ నాయకులు కొలన్ ప్రభాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, పి.ప్రభాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రాజేందర్రెడ్డి, వెంకట్యాదవ్, విష్ణువర్దన్రెడ్డి, నర్సింహారెడ్డి, కమ్మరి శ్రీను, ముక్రంఖాన్, ఇమ్రాన్, రాంచంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, అవిలాశ్గౌడ్, రాంచందర్, భూపాల్రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్తర్తలు, యువకులు పాల్గొన్నారు.