తాండూరు, డిసెంబర్ 14: ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని… తాజాగా ప్రజలు ఇ చ్చిన తీర్పును శిరసావహిస్తామని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవడం బీఆర్ఎస్ నైజం కాదన్నారు.
పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కా ర్యకర్తలకు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామిలన్నీ నెరవేర్చాలన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గా, మంత్రిగా ఉన్నప్పుడు తాండూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన రూ.వేల కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.
తాండూరు పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10.30 గంటలకు తాము నిర్వహించే అయ్యప్ప స్వామి మహా పడిపూజలకు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు, నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. లోకకల్యాణం, తాండూరు నియోజక వర్గం మంచి కోసం చేస్తున్న మహాపూజలో పార్టీలకు అతీతం గా అందరూ పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు.