కడ్తాల్, జూలై 26 : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సహకారంతో మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్ష వాసవికి రూ.34 వేలు, ఈదులపల్లి శేఖర్కు రూ.36 వేలు, వెల్దండ మండల కేంద్రానికి చెందిన మిర్యాల మౌనికకు రూ.51 వేలు, పెద్దాపూర్కి చెందిన చిట్టెమ్మకి రూ.27,500, కొట్రా గ్రామానికి చెందిన మల్లేశ్కు రూ.34,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీలను ఆదుకోవడానికి రూ.లక్ష పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరు పేదలకు వరంలా మారిందన్నారు. 2014కి ముందు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అమలుకు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, సురేంద్రెడ్డి, రఘురాములు, సుమన్, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి తదితరులు పాల్గొన్నారు.