రంగారెడ్డి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వరుస విజయాలతో రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పలు హోదాల్లో పనిచేశారు. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా, తెలంగాణలో తొలి మహిళా మంత్రిగానూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన అగ్రనేతలు ఈ సెగ్మెం ట్ లో ప్రచారం చేసినా సబితాఇంద్రారెడ్డి ఘన విజయం సాధించి తనకు ఎదురే లేదని నిరూపించుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఏకంగా 1,25,549(40.98)శాతం ఓ ట్లను పొందడమే కాకుండా..ప్రత్యర్థిపై 26,158 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని మూటగట్టుకున్నారు.
జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గానికి 2000లో జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి సబితాఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ ఇదే సెగ్మెంట్ నుంచే గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గంగా ఏర్పాటు కాగా.. సబితాఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి స్వరాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా గుర్తింపు పొందారు. 2023లోనూ అదే పరంపరను కొనసాగించి విజయఢంకా మోగించారు.
మొయినాబాద్ : కాగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి సబితారెడ్డి చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చేరుకుని తన భర్త స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అక్కడస్థానికులతో మాట్లాడారు.
ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మంత్రి సబితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీంపట్నం సీవీఆర్ కాలేజీలో నిర్వహించిన కౌంటింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గెలుపునకు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన బలం, బలగం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలేనని, వారి ఆశీర్వాదాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని పేర్కొన్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు.
-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ప్రతి ఎన్నికల్లోనూ సబితాఇంద్రారెడ్డి భారీ మెజార్టీతో ప్రత్యర్థులపై గెలుపొందుతున్నారు. 2009 ఎన్నికల్లో 65,077 ఓట్లను పొంది విజయం సా ధించారు. 2018లో 95,481(40.76 శాతం) ఓట్లను సాధించగా.. ఈసారి ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 5,46,654 ఓట్లు ఉండగా.. 3,06,386 ఓట్లు పోలయ్యాయి. అందులో సబితాఇంద్రారెడ్డి 1,25,549(40.98) ఓట్లను సాధించడంతోపాటు ప్రత్యర్థిపై 26,158 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్, ప్రియాంకగాంధీలతోపా టు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్షా వం టి అగ్రనేతలు ఈసారి ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న సబితా రెడ్డి విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు.