తాండూరు, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం కాశింపూర్ సమీపంలో బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయక్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఆత్మీయ సమ్మేళనానికి బషీరాబాద్ మండల పరిధిలోని 36 గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. కళాకారుల ఆటాపాటలు, కార్యకర్తల ఉత్సాహం, కేరింతలు, మహిళల నృత్యాలతో పాటు గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా చేయడానికి సీఎం కేసీఆర్ విజన్తో పని చేస్తున్నారన్నారు.
విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాల, పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి కేజీటూ పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీటను వేసి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను రాష్ట్ర సర్కార్ అమలు చేస్తుందన్నారు. ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు, ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణతో సాగునీటి సామర్థ్యం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో మాట్లాడి తాండూరు నియోజకవర్గానికి రూ.వేల కోట్ల నిధులు తీసుకురావడంతో తాండూరు రూపురేఖలు మారాయన్నారు. తాండూరు బిడ్డగా ఎన్నికల్లో గెలిపించినందుకే మీ దయతో ఎమ్మెల్యే పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కలిసి కట్టుగా పని చేద్దామని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పంజుగుల శ్రీశైల్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలే తమ బలం.. బలగమని స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందినట్లు భారత దేశం అభివృద్ధి చెందాలంటే, దేశంలో రైతు రాజ్యం రావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రమాదవశాతు రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా తెలంగాణ సర్కారు అందజేస్తుందన్నారు. రూ.100 కోట్లు ఇస్తామన్న బీజేపీకి తలవంచకుండా సరైన గుణపాఠం చెప్పి తాండూరు కందిపప్పులా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి దేశంలోనే భౌగోళిక గుర్తింపు పొందినారని పేర్కొన్నారు.
తాండూరు మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రత్యేక నిధులు, పథకాలు ప్రవేశ పెట్టడంతో ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులను తీసుకువచ్చి వెనుకబడిన తాండూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్తో పాటు గతంలో ఉన్న పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సీనియర్ నేతలు నర్సిరెడ్డి, గోపాల్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.