కొడంగల్, నవంబర్ 25 : గెలుపుదిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మారు పట్నం నరేందర్రెడ్డి పట్టం కట్టే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రతిపక్ష పార్టీల నేతలు బీఆర్ఎస్కే పూర్తి మద్దతు తెలుపుతున్నారు. రోజువారీగా బీఆర్ఎస్లో చేరికలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ అలుపెరగని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యే ఎక్కడ ప్రచారం చేసినా ఆ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలుకుతున్నారు. పట్నం నరేందర్రెడ్డితోనే కొడంగల్కు కొత్తరూపు వచ్చిందని, మరోమారు గెలిపించుకుంటే కొడంగల్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రచారంలో మంగళహారతులు పట్టి తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి కేసీఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
మంత్రి మహేందర్రెడ్డి తమ్ముడిని గెలిపించుకునేందుకు అలుపెరగని ప్రచారం నిర్వహిస్తూ.. ప్రతిపక్ష పార్టీల నాయకులను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంతో పాటు అన్ని వర్గాల, పార్టీల నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్, దుద్యాల మండలాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మంత్రి పర్యటనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగింది. ప్రచారంలో తమ్ముడితో కలిసి మంత్రి మహేందర్రెడ్డి ఓటర్లను నేరుగా కలిసి గ్రామాల సమస్యలను తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. మరో 5 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
మంత్రి, ఎమ్మెల్యే కలిసి ప్రచారం నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మరింత బలం పెరిగింది. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ప్రజల మధ్యన ఉంటూ ప్రజాసేవకు అంకితం అయ్యారని ప్రజలు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో 7వేలకు పైగా మెజారిటీ రాగా, ఈ సారి 30వేల మెజారిటీని దక్కించుకొని మరోమారు ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డిని చూడాలని బీఆర్ఎస్ కార్యకర్తలు లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా కేసీఆర్, కేటీఆర్ పర్యటనల్లో ఎమ్మెల్యేకు ప్రమోషన్ ఇస్తామని హామీ ఇవ్వడం మరింత బలం చేకూరింది.
గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి గెలిపించుకున్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంది. రేవంత్రెడ్డి వల్ల కొడంగల్ దశ మారుతుందని భావించి రెండు పర్యాయాలు గెలిపించుకున్నామని, ఆయనతో కొడంగల్కు ఎటువంటి మేలు జరగలేదని ప్రజలు పేర్కొంటున్నారు.
మొదటి, రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కొడంగల్కు మాత్రమే పరిమితమై ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల్లో రోడ్షో ప్రచారం నిర్వహించడం మాత్రమే జరిగేదని తెలిపారు. మూడోసారి హెలీకాప్టర్లో వచ్చి రోడ్షోకు పరిమితమై వెళ్లిపోవడం మాత్రమే జరిగిందని, ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని మూడో సారి ఓడించిడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సారి కూడా మళ్లీ అదేవిధంగా ప్రవర్తిస్తూ.. ప్రజలను విస్మరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా ప్రజల మధ్యకు రాకపోవడం పట్ల ఓటర్లు విసుక్కొంటున్నారు.
అధికారం కోసం మాత్రమే రేవంత్రెడ్డి పరితపిస్తున్నాడని, ప్రజా సంక్షేమం ఆయనకు పట్టలేదని పేర్కొంటున్నారు. ప్రజల్లోకి రేవంత్రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రచారం చేయడాన్ని ఓటర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దౌర్జన్యం చేసినట్లు ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలన, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహకారంతో కొడంగల్ ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలు పేర్కొంటున్నారు.