ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బండిసంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి పదోతరగతి పరీక్ష పేపర్ సర్క్యులేట్ చేయడంలో ప్రధానపాత్ర పోషించి ప్రభుత్వానికి చిక్కాడని అన్నారు. బండి సంజయ్ తన చిల్లర రాజకీయాలతో ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివిధ రాష్ర్టాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. పరీక్షా పేపర్లను వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసిన వ్యవహారంలో బండిసంజయ్ పాత్ర ఉందని స్పష్టంగా పోలీసులు గుర్తించిన తర్వాతే ఆయనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పేపర్ సర్క్యులేట్కు కారకుడైన వ్యక్తితో బండిసంజయ్ సుమారు 140సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన బండిసంజయ్ను ఎంపీ పదవినుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే, బీజేపీ నాయకత్వం ఆయనను పార్టీనుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ.చంద్రయ్య, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎ.వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎ. యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు బి.జగదీశ్యాదవ్, అంజిరెడ్డి, రాములు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.