షాబాద్, ఫిబ్రవరి 16 : 111 జీవోపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం శాసనసభా సమావేశాల్లో కోరారు. గత ప్రభుత్వ హయాంలో 111జీవో రద్దు చేశారని, దీనిపై కొత్తగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారన్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం జీవో రద్దు చేసిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అన్ని పార్టీలకు చెందినవారిని గౌరవిస్తూ అభివృద్ధి పనులను అప్పజెప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వమూ అందరిని గౌరవించేలా అభివృద్ధి పనులను ఇవ్వాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎమ్మెల్యే యాదయ్య చెప్పిన అంశాలన్నీ నోట్ చేసుకున్నామని, ఆయా శాఖలకు పంపిస్తామని సమాధానమిచ్చారు.