ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కుటుంబంలా కలిసి ఉండాలని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. దేశానికి, రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు ఎంతో అవసరమని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారానికి ఎప్పటికప్పుడు దీటుగా సమాధానమిద్దామన్నారు. మొయినాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. గతంలో ఎండాకాలం వస్తే తాగునీటి కోసం గోసపడేవారని, ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీటిని ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు జలకళ సంతరించుకున్నదని, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయన్నారు. విద్యా, వైద్య రంగాల్లో విశేష ప్రగతి సాధించడంతో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టకున్నా అనేక పథకాలను ప్రారంభించి పకడ్బందీగా అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, దీనికోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం/తుర్కయాంజాల్, మార్చి 31 : దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వం కోసం బీఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరువతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 2,391కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 24వార్డులున్నాయన్నారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్పార్టీకి చెందిన చైర్మన్ ఉండటం వలన అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తాను ప్రత్యేక చొరువ తీసుకుని రూ.94కోట్లతో 24వార్డులకు పూర్తిస్థాయి తాగునీరు అందించే కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో రూ.3కోట్లతో మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే, రూ.4కోట్లతో వెజిటేబుల్ మార్కెట్కు శంకుస్థాపన చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ కౌన్సిల్ అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించటం కోసం వార్డుకమిటీ కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీలోని 24వార్డులకు సంబంధించిన వార్డు అధ్యక్షుడు ఈనెల 10న తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించి, ఆయా వార్డులల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించటానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సమావేశాలు నిర్వహించటంలో వార్డుకమిటీలు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయంలోనూ, దళితబంధు కేటాయింపులో పార్టీకోసం కష్టపడే వారిని గుర్తించి వారికి కేటాయిస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే, పార్టీపైన, పార్టీ నాయకులపైన కొంతమంది స్థాయిని మరిచి విమర్శిస్తున్నారని, అలాంటి విమర్శలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ..ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో సరైన సముచితస్థానం లభిస్తుందన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా రైతును రాజునుచేశారని, తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపాలిటీ ఫ్లోర్లీడర్ కల్యాణ్నాయక్, మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, రైతుబంధు సమితి సభ్యులు బలదేవ్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, కౌన్సిలర్లు సంగీత, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, కీర్తన, స్వాతి పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేయాలి..
ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
– కొంతం యాదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ అధ్యక్షుడు
బీఆర్ఎస్తో అన్ని వర్గాలకు సమన్యాయం..
బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతున్నది. గిరిజనులకు రాజకీయాల్లో అవకాశాలు లభించాయి. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కొంత కాలంగా కమ్మగూడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల పట్టాల సమస్య ఎమ్మెల్యే మంచిరెడ్డి సహకారంతో తీరింది. ప్రజలంతా బీఆర్ఎస్తోనే ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలది.
– కల్యాణ్ నాయక్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్