ఆమనగల్లు, డిసెంబర్ 28 : ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ జ్యోతి అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 63 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. రూ.35 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి పైపులైన్ల నిర్మాణం, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ మురుగు కాల్వలు, పార్కులు, సురసముద్రం చెరువు వద్ద బతుకమ్మ ఘాటు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్లో రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణం. ఆమనగల్లు పట్టణంలో రూ.2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం , రూ. కోటితో మాడల్ గ్రంథాలయ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. గుర్రంగుట్టకాలనీలోఉన్న డంపింగ్ యార్డును అక్కడి నుంచి ఎత్తివేసి సర్వే నంబర్ 1429లో రూ. కోటితో కొత్తగా నిర్మిస్తామని అన్నారు.
సర్వే నంబర్ 16లో రూ. కోటితో వైకుంఠధామం, సర్వే నంబర్ 117 లో రూ. 2 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్ర నిర్మాణం, పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి షాద్నగర్ వరకు రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అదే విధంగా ఎన్హెచ్ 765 హైవే నుంచి రైతు వేదిక భవనం వరకు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, గొల్ల కుర్మల భవనానికి రూ.10 లక్షలు, గీత కార్మిక భవనానికి రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈ పనులకు మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. అనంతరం డంపింగ్యార్డు, నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు 1000 డిక్షనరీలు పంపిణీ చేశారు.
అనంతరం ప్రజా ఆవాసాల మధ్య ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న డంపింగ్ యార్డును పరిశీలించారు. పూసలి కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేసి 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కమఠం రాధమ్మ, మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, నాయకులు నిరంజన్, వెంకటయ్య, జంతుక అల్లాజీ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కర్కల్పహాడ్-చరికొండ గ్రామాల మధ్య రూ.1.91 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 108 పాఠశాలల్లో రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, మార్చిలోగా మరో 1,500 దళితబంధు యూనిట్లను పంపిణీ చేస్తామన్నారు. కర్కల్పహాడ్ చౌరస్తాలో బస్టాండ్ను నిర్మించాలని సర్పంచ్, ఎంపీటీసీలు ఎమ్మెల్యేని కోరడంతో వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు హరిచంద్నాయక్, యాదయ్య, భారతమ్మ, భాగ్యమ్మ, సుగుణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ఉమావతి, ఉప సర్పంచ్లు వినోద్, నర్సింహ, ముత్యాలు, నరేశ్, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్అలీ, నర్సింహాగౌడ్, సేవ్యానాయక్ పాల్గొన్నారు.