తలకొండపల్లి, జనవరి 10: తలకొండపల్లి అబివృద్ధి చెందాలంటే రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలని, మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ 50 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం ఆర్అండ్బీ శాఖ అధికారులతో కలిసి రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలకొండపల్లి నుంచి ఆమనగల్లు వరకు రూ. 37 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు పనులు నాణ్యతగా త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు. అడ్డరోడ్డు, వెల్జాల్ మూలమలుపు వద్ద వంద ఫీట్ల విస్తీర్ణంతో రెండు జంక్షన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రం ప్రభుత్వం రోడ్ల అభివృద్ధ్దికి వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నదని అన్నారు. మండల కేంద్రంలో గల 6,7 సర్వే నెంబర్లలో అర్హులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అర్హులను గుర్తించాలని తహసీల్దార్కు సూచించారు. తలకొండపల్లి మండలానికి 500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ సమస్యలపై పలువురు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరిశీలించారు. ఇద్దరు వైద్యులకు ఇద్దరూ రాకపోవడంతో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో సమావేశం ఉన్నదని సిబ్బంది చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే డీఎంహెచ్వోకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎలాంటి సమావేశం లేదని డీఎంహెచ్వో చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లో ఇద్దరికి గైర్మాజరు వేశారు. వైద్యుల పనితీరు మార్చుకోవాలని, సక్రమంగా పని చేయాలని అన్నారు. పశువైద్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, కేజీబీవీ పాఠశాలలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో రూ.5 లక్షలతో సీసీ నిర్మాణం, కేజీబీవీలో 5 లక్షలతో పెయింటింగ్ పనులకు నిధులు మంజూరు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, జడ్పీ కోఆప్షన్ రహమాన్, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు చంద్రయ్య, ఈశ్వర్నాయక్, వరలక్ష్మి, శ్యాంసుందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ కృష్ణ, ఏఈలు కఠారియా, రాకేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.