మియాపూర్ , ఏప్రిల్ 15 : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులు, కార్య కర్తలకు పిలుపునిచ్చారు. నేటి ప్రచార రథాలే.. వచ్చే నెలలో విజయ రథాలుగా మారతాయన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను సోమవారం ఎమ్మెల్యే గాంధీ తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరి తమపై ప్రత్యర్థులుగా నిలబడుతున్న వారికి ఓటమి తప్పదన్నారు.
చేవెళ్లలో రెండు సార్లు గులాబీ జెండాయే ఎగిరిందని, మూడోసారీ తమదే విజయమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేవెళ్ల విశేష అభివృద్ధి సాధించిందని, ఇంటింటికీ వెళ్లి ఈ విషయాన్ని తెలపా లని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, నార్నె శ్రీనివాస్రావు, మాధవరం రంగారావు, శ్రీనివాస్యాదవ్, భిక్షఫతి, సంతోష్రావు, కాశీనాథ్, శ్రీనివాస్, రాజేశ్చంద్ర, జగన్ పాల్గొన్నారు.