ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం బోరుబావుల వద్దకు వెళ్లేదని, రాష్ట్రం వచ్చాక ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ నల్లాలను వేయడంతో ప్రస్తుతం మండుటెండల్లోనూ తాగునీటి సమస్య లేదన్నారు. ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయన్నారు. నేడు సీసీ రోడ్డులేని పల్లె లేదని, ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డును ప్రభుత్వం వేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలను రాష్ట్ర సర్కారు ఆదుకుంటున్నదన్నారు.
షాద్నగర్, మార్చి 26 : మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కొనసాగడం లేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలు కూడా తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఆనాడు ఆదరణకు నోచని తెలంగాణ.. నేడు దేశమే తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందని.. ఇందుకు కారకులు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులు సంతోషంగా బతుకుతున్నారని తెలిపారు. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ల కోసం ఖాళీ బిందోలతో పొలాలు, గట్ల వెంట పోయటోళ్లమని.. నేడు మిషన్ భగీరథతో మన ఇంటి ముందే మంచి నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, దళిత బంధు వంటి ఎన్నో పథకాలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు మేలు చేశాయని, ప్రజలు గౌరవంగా తలెత్తుకొని బతికేవిధంగా మార్చాయని పేర్కొన్నారు. గత పాలకులు ఏనాడు కూడా పల్లెలు, తండాలను పట్టించుకోలేదని.. నేడు పల్లెలు కూడా పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. వందల కోట్ల నిధులను వెచ్చించి మారుమూల పల్లెల్లో కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశామని.. అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చామని చెప్పారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అమ్ముడు తప్పా ఉపాధి చూపని బీజేపీ ఉపాధి అవకాశాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమి చేశారో చెప్పమంటే చెప్పరు కానీ.. మీటింగ్లు పెట్టి గప్పాలు కొడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని.. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెపుతారని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పార్టీకి ప్రధానమనే విషయాన్ని గ్రహించాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, నాయకులు రాజావరప్రసాద్, లక్ష్మీనర్సింహారెడ్డి, వెంకట్రావు, మల్లేశ్, సూర్యప్రకాశ్, ప్రకాశ్గౌడ్, ఆంజనేయులుగౌడ్, హన్మ్యానాయక్, బాబునాయక్, బాలునాయక్, శేఖర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.