ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరింపజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 106మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, చేతికర్రలు, ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోకజవర్గంలోని పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ స్థాపించి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహించినట్లు తెలిపారు.
నాడు ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన యువతీ యువకులు సుమారు 400మంది వరకు ఉద్యోగాలు సాధించారని అన్నారు. అలాగే, నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఆదుకోవాలన్న సంకల్పంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 106మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు, చేతికర్రలు, దివ్యాంగులకు సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. ఇంకా కాళ్లు, చేతులు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే వారికి కృత్రిమ కాళ్లు, చేతులు అందజేస్తానని తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ సేవలు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పేద ప్రజల సంక్షేమం కోసమే ఎంకేఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా గతంలో ఎంతోమందికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఫౌండేషన్ సేవలు మరింత విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు.
ఫౌండేషన్ ఛైర్మన్ ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం సేవలు కొనసాగుతున్నాయని ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాల్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు అందజేయడం సంతోషించదగ్గ విషయమని పలువురు దివ్యాంగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, ఆర్టీసీ డీఎం బాబునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు.