పరిగి, ఆగస్టు 28 : మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేకమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. మిషన్ భగీరథలో చేరిన వీఆర్ఎలు చక్కటి సేవలు అందించడం ద్వారా మన్ననలు పొందాలని సూచించారు. సోమవారం పరిగి మండలం రాఘవాపూర్ నీటిశుద్ధి ప్లాంటులో శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన మిషన్ భగీరథ సహాయకులకు ఏర్పాటుచేసిన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్మిత సబర్వాల్ మాట్లాడుతూ తాము గత జన్మలో పుణ్యం చేసుకున్నందునే ప్రతి ఒక్కరికి తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. అనేక సంవత్సరాలుగా భూ సంబంధిత సేవలు అందజేసిన వీఆర్ఎలు మిషన్ భగీరథలోకి రావ డం ద్వారా వారికి చక్కటి సేవలు అందించే సదావకాశం లభించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందజేసే సేవలపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. అవసరమైనన్ని పర్యాయాలు శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. టాలెంట్, హార్డ్వర్క్ చూసి మిషన్ భగీరథలో ఎదగడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. నాన్ టెక్నికల్ స్టాఫ్ సైతం చక్కటి సేవలతో మరింత ఎదగవచ్చని తెలిపారు. మిషన్ భగీరథ సహాయకులకు సర్పంచ్లు సైతం వంద శాతం సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనేది ముందుగా సర్వే చేయాలని సహాయకులకు ఆమె సూచించారు. వారంలో ఒకటిరెండు ఫిర్యాదులు వస్తాయని, వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారన్నారు. ఎక్కడైనా పైప్లైన్ లీకేజీ, ఇతర సమస్యలుంటే సహాయకులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రత్యేక బృందాలు ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటాయని, ఫిర్యాదు అందిన గంటలోపు వాటి పరిష్కారానికి ఈ బృందాలు కృషి చేస్తాయని తెలిపారు. వీఆర్ఎల సర్వీసులో మిషన్ భగీరథ ఒక కొత్త చాప్టర్ అని, అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని, పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించాలన్నారు. బాధ్యతలు గుర్తెరగాలని, మిషన్ భగీరథలో ఏమి చేయాలో స్పష్టంగా నేర్చుకోవాలని సూచించారు. ప్రతి మనిషి బతకడానికి నీరు అవసరమని, అలాంటి మంచినీరు ప్రజలకు అందిస్తే ఆదాయం ఇచ్చిన వారమవుతామని తెలిపారు. ఏ దేశంలో తాగునీటి వ్యవస్థ చక్కగా ఉంటుందో ఆ దేశం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నారు. మిషన్ భగీరథలో పని చేయడం ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం కలిగిందని గర్వంగా ఫీలవ్వాలన్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి వీఆర్ఏలను మిషన్ భగీరథ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. సహాయకులకు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తామని, 3000 హెచ్పి మోటార్ ఆన్ చేయడం, ఇతర అంశాలు సైతం నేర్పిస్తామని చెప్పారు. మీ శక్తిని బట్టి పనులు అప్పగిస్తామని పేర్కొన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ సహాయకులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటి శుద్ధి ప్లాంటు ఆవరణలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ మొక్క నాటి నీరు పోశారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు చెన్నారెడ్డి, జ్ఞాన్కుమార్, రాం చందర్, లలిత, వినోబాదేవి, చంద్రమౌళి, మధుబాబు, ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ శ్రీనివాస్, డీఆర్డీవొ కృష్ణన్, ఆర్డివొ విజయకుమారి, తహసీల్దార్ దానయ్య, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, రాఘవాపూర్, జాఫర్పల్లి సర్పంచ్లు నల్క జగన్, బి.అనిత తదితరులు పాల్గొన్నారు.