బొంరాస్పేట, అక్టోబర్ 3: మండల కేంద్రం పట్టణ రూపు సంతరించుకోనున్నది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఒక కిలోమీటరు దూరం వరకు ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తారు. మధ్యలో డివైడర్ను నిర్మిస్తారు. రోడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేస్తారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలనూ నిర్మిస్తారు.
గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే ఇక్కడ పర్యటించినప్పుడు ప్రధాన రోడ్డును విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చేందుకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నుంచి నిధులను కూడా మంజూరు చేయించారు. మండల కేంద్రం నుంచి భూలక్ష్మీ అమ్మవారి ఆలయం చౌరస్తా మీదుగా పెట్రోల్ పంపు వరకు కిలోమీటర్ వరకు రోడ్డును విస్తరించనున్నారు. ఇది పూర్తైతే బొంరాస్పేట రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బొంరాస్పేటలో ప్రధాన రోడ్డు విస్తరణ పనులతోపాటు పలు గిరిజన తండాలకు మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం మంత్రులు మహేందర్రెడ్డి, సత్యవతి రాథోడ్ శం కుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులతో పాటు పార్టీ నాయకులు చేస్తున్నారు.