తాండూరు, జూలై 13 : తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి లోక కళ్యాణార్థం తాండూరులోని తమ నివాసంలో 11 రోజులపాటు చేపట్టిన శ్రీరాజశ్యామల, శతచండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం గురువారం పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. యాగశాలను తీరొక్క పూలతో అందంగా అలంకరించగా వివిధ రూపాల్లో అమ్మవార్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతులు, పండితులు, పురోహితుల వేదమంత్రాలతో జూలై 3 నుంచి 13 వరకు 11 రోజులపాటు మహాయగం అత్యంత వైభవంగా కొనసాగింది. నియోజకవర్గంలోని 12645 మంది దంపతులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లక్షకుపైగా భక్తులు యాగశాలను దర్శించుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అతిరుద్ర మహాయాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల హితం కోసం రోహిత్రెడ్డి దంపతులు మహాయాగం చేయడం అభినందనీయమన్నారు.
అజ్ఞానుల మాటలు ప్రజలు పట్టించుకోవద్దు
మహాయాగానికి సహకరించిన పీఠాధిపతులు, పూజారులు, బీఆర్ఎస్ నేతలు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మహాయాగం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. పూజలు ముగిసిన తర్వాత అమ్మవారే స్వయంగా ప్రధాన యాగశాలను పూర్ణాహుతి చేశారని తెలిపారు. తామంటే గిట్టనివారు మహాయగం గురించి తప్పుగా మాట్లాడితే పాపం తగులుతుందన్నారు. తాము చేసిన యాగానికి, భక్తికి మెచ్చి అమ్మవారే స్వయంగా పూర్ణాహుతి చేయడం చాల మంచిదని పీఠాధిపతులు తెలిపినట్లు పేర్కొన్నారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అజ్ఞానుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పూజారులు మాట్లాడుతూ.. మహాయాగం అత్యంత వైభవంగా జరిగిందన్నారు. ఎలాంటి అపశృతి జరగలేదన్నారు. తాండూరు ప్రజలందరికీ మంచి జరుగుతుందని తెలిపారు.