ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19 : రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్కు రెండు కండ్లలాంటివని, నిత్యం రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే తనయుడు ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదనయాత్రలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ర్టావృద్ధి కోసం సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనునిత్యం కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరుగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడటానికి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తున్నారని తెలిపారు.
‘ప్రగతి నివేదన’ యువతకు స్ఫూర్తిదాయకం
ప్రగతి నివేదన యాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం ప్రగతి నివేదన యాత్ర మంచి కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తున్నారని ఇది యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రగతి నివేదన యాత్ర ద్వారా గ్రామాల్లో ప్రశాంత్కుమార్రెడ్డి దృష్టికి వచ్చిన పాఠశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామంలో చేపట్టిన అబివృద్ధితో పాటు అందిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికి తెలియజేయడం వల్ల ప్రభుతానికి మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రగతి నివేదన యాత్ర లాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే, ఆయన తనయుడు పోటీపడి పనిచేస్తున్నారని వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడం కోసమే ప్రశాంత్కుమార్రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే సుమారు 2,930కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తాగునీరు కోసం రూ.73కోట్లు, ఆసరా పింఛన్ల కింద ప్రతి నెల రూ.56లక్షలు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ల ద్వారా కోట్లాది రూపాయలను ప్రభుత్వం ద్వారా అందుతున్నదని తెలిపారు. మున్సిపాలిటీల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు త్వరలోనే ప్రభుత్వం రూ.10కోట్లను కేటాయించడానికి హామీ ఇచ్చిందన్నారు.
రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి
నియోజకవర్గంలో అన్ని రహదారులను అభివృద్ధి చేసుకోవటంతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి నాగన్పల్లి, పోల్కంపల్లి మీదుగా విజయవాడ రహదారిని విస్తరించడం కోసం ప్రభుత్వం రూ.60కోట్లను కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు విస్తరన పనులు ప్రారంభం కాగానే, కొంతమంది కోర్టులకు వెళ్లి అడ్డుపడ్డారని, రోడ్డు విస్తరణ జరిగితే ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని, రోడ్డు విస్తరణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణ పనులకు సహకరిస్తే వారం రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆటవిక పాలన
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేటికీ ఆటవిక పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రశాంత్కుమార్రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పర్యటించి ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా పంపిణీచేసి ప్రజలతో మమేకమయ్యారు.
కార్యక్రమంలో పట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, వైస్ చైర్మన్ యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రావు, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, సహకార సంఘం చైర్మన్లు సుదర్శన్రెడ్డి, వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు జగదీశ్యాదవ్, మహేశ్గౌడ్, రాజు, రాజ్కుమార్, విజయ్కుమార్, శివసాయి ఉన్నారు.