మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మోదీ పాలనతో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కందుకూరులోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై మోయలేని ధరల భారం మోపిందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని ఎద్దేవా చేశారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఎవరున్నారని ప్రశ్నించారు. బీజేపీ మాయమాటలు నమ్మి యువత మోసపోవద్దని సూచించారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని ఏయే మండలానికి ఏమేం కావాలో సీఎం కేసీఆర్కు తెలుసునన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని పేర్కొన్నారు.
కందుకూరు, ఏప్రిల్ 1 : హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి కాలం గడపాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని.. వారి రొంపిలో యువకులు పడవద్దని మంత్రి సబితారెడ్డి కోరారు. శనివారం సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై పటాకులు కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు అభివాదం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. అబద్దాలు ఆడడంలో బీజేపీ నంబర్ వన్ అని తెలిపారు. మందిరం, మసీదులు తప్ప వారికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిజమైన హిందువు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. యువకులను తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ 80వేల ఉద్యోగ నియామకాల కోసం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు చిన్న పొరపాటును కూడా రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. అవి మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. నల్లధనం వెలికితీసి రూ.15లక్షలను రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని.. మీ హామీలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. కేవలం తమ ప్రభుత్వాన్ని విమర్శించడానికేనా అని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, మందుల ధరలను కూడా పెంచారన్నారు. బీజేపీ ప్రభుత్వంపై విసిగిన ప్రజలు దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. యువకులు బీజేపీ పాలనను గట్టిగా వ్యతిరేకించాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి 100 మంది కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి సూచించారు.
రేవంత్రెడ్డిని నిలదీయాలి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గ్రామాలకు వస్తే నిలదీయాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తెలిపారు. కందుకూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ.. పనిగట్టుకొని సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని, ఇక మీదట విమర్శిస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాహుల్గాంధీ ఎంపీ పదవిని రద్దు చేస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే సత్తా లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేందర్రెడ్డి, మహిళా అధ్యక్షులు ఇందిరమ్మ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు, సర్పంచ్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు
పల్లెలను అభివృద్ధిపర్చిన ఘనత సీఎం కేసీఆర్దే..చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
వికారాబాద్ : ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి ఏం కావాలో తెలిసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శనివారం నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రధాన రహదారి నుంచి డప్పు చప్పుళ్ల మధ్య పటాకులు కాలుస్తూ సమావేశ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామాలు, మండలాలకు ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. బంగారు మైసమ్మ ఆలయం నుంచి ఎక్మామిడి సమీపంలోని బ్రిడ్జి వరకు రూ.17.50కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు, మండలంలోని రూ.10కోట్లతో సీసీ రోడ్లు, ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన రోడ్లకు సుమారు రూ.15కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఆర్కతల గ్రామంలో 50 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పనులు జరుగుతున్నాయన్నారు.
నవాబుపేట మండలానికి మరిన్ని పరిశ్రమలు
నవాబుపేట మండలానికి మరిన్ని పరిశ్రమలు తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. గ్రామాల్లో నీటి కోసం గొడవలు జరిగేవని, ప్రస్తుతం ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంతో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి కష్టాలు ఉన్నాయనే సమాచారం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. అందుకే వాటిపై నోరు మెదపడం లేదన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ, భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు బంధు, గుంట భూమి ఉన్నా కూడా రైతు చనిపోతే రూ.5లక్షలు, వారి కుటుంబంలో ఆసరా పింఛన్లు, వారి ఇండ్ల ఎదుట సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 5వేల ఎకరాలకు కలిపి ఒక క్లస్టర్ను ఏర్పాటుచేసి రైతు వేదికలను నిర్మించిందన్నారు. రైతులకు సరైన సలహాలు, సూచనలిస్తూ రైతు పెన్నిధిగా సర్కారు నిలిచిందని పేర్కొన్నారు.
వృద్ధులు, గీతకార్మికులు, బోదకాలువారికి, వితంతు, దివ్యాంగులు తదితరులకు ఆసరా పింఛన్లు అందించి వారిని ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. ఇంతకుముందు ఉన్న పాలకులెవ్వరూ ఇంతగా ప్రజల కోసం ఆలోచించలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలోనే మంచినీటి కష్టాలు ఇంకా తీరడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశంలో అన్ని రాష్ర్టాలకు సంక్షేమ పథకాలు అందించాలనే మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కు మనమందరం తోడుగా నిలువాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రతిపక్ష నాయకులను నిలదీయాలి
పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని అందరినీ కలుపుకపోయి ఆప్యాయంగా పలుకరించేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ, అర్హులకు ఆసరా పింఛన్లు, గ్రామాలకు పల్లె ప్రగతి పనులు చేపట్టి అభివృద్ధిపర్చినట్లు తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఇంటి ముందుకు వస్తే.. గతంలో ఏం చేశారో ? ప్రస్తుతం ఏం చేస్తారో నిలదీయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య, చైర్మన్ను సీనియర్ నాయకుడు మల్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్ రఫీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.