రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి కేంద్రంలోనూ ఆరోగ్య సిబ్బందిని నియమించాలని, ప్రాథమిక చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారంతోపాటు పరీక్షల పట్ల విద్యార్థుల్లో నెలకొని ఉన్న ఆందోళనను దూరం చేసేలా కౌన్సెలింగ్ అందించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన టెలీ మానస్-14416ను వినియోగించుకోవచ్చని సూచించారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని మంత్రి అన్నారు. ప్రతి కేంద్రంలోనూ తాగునీటి వసతి, సరిపడా ఫర్నిచర్, ఇతర కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను నేరుగా వెబ్సైట్ (http://tsbie.cgg.gov.in) ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
182 కేంద్రాల్లో పరీక్షలు : కలెక్టర్ హరీశ్
వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు 182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 71,773 మంది మొదటి సంవత్సర విద్యార్థులు, 55,883 మంది రెండో సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 31 ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశామని.. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించినట్లు తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రంలోనూ ఏఎన్ఎం, ఆశ వర్కర్ ఉండేలా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష సమయాలకనుగుణంగా అన్ని రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశామన్నారు. సీసీ కెమెరాల మధ్య ప్రశ్నాపత్రాల బండిల్స్ తెరిచేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. పరీక్షలు ముగిసిన మీదట సీల్ చేసిన ఆన్సర్ షీట్ బండిళ్లను మూల్యాంకన కేంద్రాలకు వేగంగా పంపించేలా కృషి చేయాలని పోస్టల్ శాఖ అధికారులకు సూచించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా, సరిపడా ఫర్నిచర్ సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం తలెత్తకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా ఇన్విజిలేటర్లతోపాటు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని వివరించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తూ.. వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం నం. 8978158484ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యానాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్రావు, పోలీస్, పోస్టల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం : కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 30 ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 9,231, ద్వితీయ సంవత్సరంలో 8,657 మంది మొత్తం 17,888 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సంబంధిత అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారులు పారిశుధ్యంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే స్టేట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూం నం.040-24601010, 24655027లను సంప్రదించాలన్నారు. మానసిక సమస్యలు, భయాందోళనలుంటే 14416కు ఫోన్ చేస్తే సైకాలజిస్టులు సలహాలు, కౌన్సెలింగ్ ఇస్తారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంకర్నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, తాండూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజామోహన్రావు, జూనియర్ లెక్చరర్ బుచ్చయ్య, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.