రంగారెడ్డి, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలపై కూలంకశంగా చర్చ జరిగింది. సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చిన సమస్యలను సావధానంగా విన్న మంత్రి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎజెండా అంశాలవారీగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసినందుకు కలెక్టర్తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై జడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులున్నారు.
వైద్య శాఖపై..
వైద్య ఆరోగ్య శాఖపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటి వెలుగు ద్వారా ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి రీడింగ్ అద్దాలు, ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందించినట్లు తెలిపారు. జిల్లాలో పల్లె, బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం కేవలం మహిళలకు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన ఎస్టిమేషన్లను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సిబ్బంది కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారికి మంత్రి సూచించారు.
విద్యా శాఖపై..
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన జరిపేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పలువురు సభ్యులు సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన మంత్రి ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వివిధ శాఖల చర్చపై..
జిల్లాలో అర్హులైనవారికి ఆసరా ఫించన్లను అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లు సరిగా లేకపోవడంపై ప్రమాదాలు జరుగుతున్నాయని, తగు మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బి అధికారులను మంత్రి ఆదేశించారు. మైనింగ్, వ్యవసాయ శాఖ, సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖతోలపాటు పలు శాఖలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చ జరిగింది.
సాయిచంద్ మృతికి సంతాపం
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపకంగా జడ్పీ సమావేశంలో సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, తెలంగాణ నిర్మాణంలోనూ గాయకుడిగా సాయిచంద్ ప్రజలను జాగృతం చేసి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. చిన్న వయసులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. సాయిచంద్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.