మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో రూ. 280 కోట్ల నిధులతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. తాండూరులో నిర్వహించిన యువ ప్రభంజనం సభలో మంత్రి మహేందర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
– మహేశ్వరం/తాండూరు, నవంబర్ 4
తాండూరు, నవంబర్ 4 : యువత చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉన్నదని, వారే ఈ దేశాన్ని బాగు చేసుకోవాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం తాండూరు విలేమూన్ మైదానంలో బీఆర్ఎస్ ‘యువ ప్రభంజనం’ సభను నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు జనమా.. ప్రభంజనమా అన్నట్టు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తాండూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. యువకుల ఉత్సాహం, ప్రజల నమ్మకం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా… ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్రను సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో, మహేందర్రెడ్డి, రోహిత్రెడ్డి తాండూరులో ఉన్నన్ని రోజులు తట్టుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సీఎం కేసీఆర్ వదిలిన బుల్లెట్లు.. వాళ్లను తట్టుకొని నిలబడే దమ్ము, ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేదని మంత్రి స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.1648.12కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. తాండూరు పట్టణాభివృద్ధి పనులకు రూ.1191.86 కోట్లు, తాండూరు మండలంలో అభివృద్ధి పనులకు రూ.236.14 కోట్లు, యాలాల మండలంలో అభివృద్ధి పనులకు 97.77 కోట్లు, బషీరాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు 68.18 కోట్లు, పెద్దేముల్ మండలం అభివృద్ధి పనులకు రూ.78.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కొందరు వలసవాదులు అడుక్కుతినే వాళ్లలా.. బయలుదేరారని ఎద్దేవా చేశారు. తాండూరు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. మళ్లీ గెలిపించండి.. అందరూ గర్వపడేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.16 వేల రైతు బంధు, సౌభాగ్యలక్ష్మి పేరుతో పేద మహిళలకు రూ.3000, రూ.400లకే వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా వైద్య చికిత్సలకు రూ.15 లక్షలు, రేషన్పై సన్నబియ్యం, అర్హులైన వారికి రూ.5016 ఆసరా పెన్షన్లు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలతో పాటు పలు నూతన పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వ్యక్తిత్వ వికాసకులు గంప నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. వ్యక్తి ఉదయం నుంచి రాత్రి వరకు అలసిపోకుండా ఉండేందుకు నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జనాల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలో వివరించారు. ఇష్టపడి కష్టపడేవారు లీడర్గా మారుతారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీశైల్రెడ్డి, బీసీ సంఘం ప్రతినిధులు డాక్టర్ అరుణ్కుమార్, రాజ్కుమార్, యూత్ నాయకులు అనిల్బాండ్, వెంకటేశ్చారి ఉన్నారు.