షాద్నగర్, మార్చి 3 : పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం ఇచ్చినం, మరుగుదొడ్లు కట్టిచ్చినం, ఈజీఎస్ పనులు చేసినం.. అని చెప్పడం తప్పా తెలంగాణ అభివృద్ధికి చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతారో బీజేపీ నాయకులు చెప్పాలని అన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని, ప్రజల ఆరోగ్యంపై కనీస శ్రద్ధ చూపలేదని అన్నారు. దేశ ప్రధాని మోదీ, అమిత్షా వంటి నేతలు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారని, తెలంగాణ అమరవీరులను అవమానపర్చారని మండిపడ్డారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే నాయకులపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 90 రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రయాణికుల వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలించే క్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి ఫరూఖ్నగర్ మండలం రాయికల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉచిత ప్రయాణం ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో సీట్లు సరిపోవడం లేదని, బస్సుల సంఖ్యను పెంచాలని పలువురు ప్రయాణికులు మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో బస్సుల సంఖ్యను పెంచుతామని వివరించారు.