మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తే సిద్దాపూర్లోని 300 ఎకరాల్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి రూ.270కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి నివేదన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. త్వరలోనే షాద్నగర్ నియోజకవర్గంలో కృష్ణా నీళ్లను పారించి తీరుతామన్నారు. ఐదు రిజర్వాయర్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంత ప్రజానీకం సహకరిస్తే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచే నీరందిస్తామన్నారు.
కోర్టులో కాంగ్రెస్ కేసులు వేస్తూ ప్రగతిని అడ్డుకుంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటాను తేల్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. 55ఏండ్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఎందుకు నీళ్లు తేలేక పోయిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మోసపూరిత ప్రకటనలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. తొమ్మిదేండ్లలో షాద్నగర్ నియోజకవర్గంలో రూ.4,669.41కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరింత ప్రగతి జరుగాలన్నా.. ప్రజా సంక్షేమం కొనసాగాలన్నా మరోసారి అంజయ్య యాదవ్ను గెలిపించుకోవాలన్నారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తే సిద్దాపూర్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం షాద్నగర్ నియోజకవర్గంలో రూ.270కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం షాద్నగర్లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
పాలమూరు ఎత్తిపోతల మొదటి పంప్ను ఇటీవలనే సీఎం కేసీఆర్ ప్రారంభించారని, త్వరలోనే షాద్నగర్ నియోజకవర్గంలో కృష్ణా నీళ్లను పారించి తీరుతామని స్పష్టం చేశారు. ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంత ప్రజానీకం సహకరిస్తే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచే నీరందిస్తామన్నారు. కాంగ్రెస్ కోర్టులో కేసులు వేసి ఆగం చేస్తుంటే, బీజేపీ కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటాను తేల్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన నాగం జనార్దన్రెడ్డి పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేశారన్నారు. 55 ఏండ్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఎందుకు నీళ్లు తేలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మోసాన్ని మోసంతోనే జయించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
కొత్తూరు మండలం సిద్దాపూర్లో ఉన్న 300 ఎకరాల్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే తప్పక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తూరు వరకు మెట్రో రైలును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, దీన్ని షాద్నగర్ వరకు కూడా పొడిగించే ఆలోచన ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ తరహాలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనున్నదన్నారు. కేసీఆర్ శ్రీరామరక్షలా ఉండి అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదేండ్ల కాలంలో షాద్నగర్ నియోజకవర్గంలో రూ.4,66.41కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న అంజయ్యయాదవ్ వైపు ఉంటారా? లేక కపట కాంగ్రెస్, బీజేపీ వైపు ఉంటారా? ప్రజలు ఆలోచించాలన్నారు.
అంజయ్యయాదవ్ను ఢీకొట్టే వారే లేరు..
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కేశంపేట జడ్పీటీసీగా గెలిచిన నాటి నుంచి గత 23 ఏండ్లుగా కేసీఆర్ను వెన్నంటే ఉన్నారన్నారు. చాలా మంచి వ్యక్తి అని, చీమకు కూడా హాని చెయ్యని వ్యక్తి అన్నారు. అంజయ్య యాదవ్ను ఢీకొట్టే వారే లేరన్నారు. సభను చూస్తుంటే అంజయ్య యాదవ్ విజయోత్సవ సభకు వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏమిటో ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తున్నారని, ఇలా చెప్పాలంటే దమ్ముండాలన్నారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్, అక్టొబర్ 5 : షాద్నగర్ పట్టణమంతా ఫ్లెక్సీలు, జెండాలతో గులాబీమయమైంది. కనుచూపు మేర జనాలే. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, పార్టీ శ్రేణుల నినాదాలు మార్మోగాయి. షాద్నగర్ పట్టణంలో డబూల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, బంజారా భవన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడారు. గాయకురాలు మధుప్రియ ఆట పాటలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇందిర, బీష్వ కిష్టయ్య, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మాజీ చైర్మన్ విశ్వం, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రాంబాల్నాయక్, జిల్లెల వెంకట్రెడ్డి, బెంది శ్రీనివాస్రెడ్డి, కందివనం సూర్యప్రకాశ్, లక్ష్మీనర్సింహారెడ్డి, యుగేందర్, ఎంఎస్ నటరాజన్, జూపల్లి శంకర్, లక్ష్మణ్నాయక్, మన్నె నారాయణ, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాసులు, జమృత్ఖాన్, తబ్రెజ్, సలీం, సర్వర్పాష, ఆనంద్, దామోదర్, రాఘవేందర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
ప్రతి పక్షాలకు ఓటు అడిగే హక్కు లేదు..
షాద్నగర్ : కేవలం ఎన్నికల ముందే ప్రతిపక్షాలకు అభివృద్ధి గుర్తుకొస్తుందని, దశబ్దాల పాటు పాలించి అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పట్నం మహేందర్రెడి అన్నారు. గురువారం షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇక్కడున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా.. అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. బీజేపీ నీతులు చెబితే ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రం వచ్చాకే షాబాద్, షాద్నగర్ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కొత్తూరు, అక్టోబర్ 5 : రంగాపూర్లో హెలీప్యాడ్ నుంచి దిగిన మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గంలో కొత్తూరుకు వచ్చారు. మున్సిపల్ నూతన కార్యాలయాన్ని మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయం లోపల మంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రెండో అంతస్తులోని మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో రిబ్బన్ కట్ చేయించి, మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్యను చైర్పర్సన్ సీటుపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత బొకే అందజేసి అభినందించారు. తర్వాత మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ వీరేందర్తో ఫొటోలు దిగారు.
‘డబుల్’ ఇండ్లను ప్రారంభించిన మంత్రి
మున్సిపల్ కార్యాలయం పక్కన రెండు బ్లాకులుగా నిర్మించిన 60 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, బాతుక దేవేందర్యాదవ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, బ్యాగరి ప్రసన్నలత, కమ్మరి జయమ్మ, చంద్రకళ, వీరమోని హేమ, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య, జనార్దనచారి, రాఘవేందర్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, అక్టోబర్ 5 : షాబాద్ మండలంలో వారం క్రితం మంత్రి కేటీఆర్ పర్యటన రోజు సభకు వచ్చి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అంతారం గ్రామానికి చెందిన ఈగ సురేందర్రెడ్డి కుటుంబానికి షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అండగా నిలిచారు. సురేందర్రెడ్డి కుటుంబానికి రూ.10లక్షల సాయాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునితామహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుఫున మరో రూ.2లక్షలు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన జడ్పీటీసీని మంత్రి రామన్న శబాష్ అవినాశ్.. అంటూ అభినందించారు. జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, బీఆర్ఎస్ పార్టీ షాబాద్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, నాయకులు మధుసూదన్రెడ్డి, పీసరి సతీశ్రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాకలిదానిగుట్టతండాలో పంచాయతీ భవనం ప్రారంభం
నందిగామ అక్టోబర్ 5 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిదానిగుట్టతండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. తెలంగాణతల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలనూ మంత్రి ఆవిష్కరించారు. సర్పంచ్ రాజునాయక్కు మంత్రి కేటీఆర్ పూల భోకేను అందజేసి అభినందించారు.
భారీ బైక్ ర్యాలీ..
మంత్రి కేటీఆర్ చాకలిదానిగుట్టతండాకు వస్తున్న మంత్రి కేటీఆర్కు మహిళలు పూలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు షాద్నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు రాజ్గోపాల్, అశోక్, మంజులరెడ్డి, మాజీ చైర్మన్ విఠల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు పద్మారెడ్డి, సర్పంచ్లు అశోక్, కట్ట కుమార్, రమేశ్గౌడ్, చంద్రారెడ్డి, నర్సింహా, స్వామి, రాజునాయక్, సంతోష, రజనీతగౌడ్, నీలమ్మ, సంధ్య, ఎల్లమ్మ, అనిత, ఎంపీటీసీలు కాట్న తల, కలమ్మ, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్ : 45 ఏండ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు గుర్తుకొచ్చాయా అని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. అసత్య ప్రచారాలకు తెరలేపి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. నాడు కరెంట్ కోతలతో సాగు నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడితే, నేడు సీఎం కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారన్నారు. మహిళలు వేసవిలో నీళ్ల కోసం అరిగోస పడేవాళ్లని, నేడు ఇంటింటికీ తాగునీటి సరఫరా అవుతుందన్నారు. షాద్నగర్ పట్టణంలో 100 పడకల సర్కారు దవాఖానతో పాటు ట్రామా కేర్, డయాలసిస్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో షాద్నగర్ ప్రాంతానికి సాగునీరు రానున్నదన్నారు. కచ్చితంగా ఆరో లిఫ్ట్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను ప్రభుత్వం కట్టి తీరుతుందన్నారు.