‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్యాలయంతో పాటు, గట్టుప్పలపల్లి, వెల్జాల్, రఘుపతిపేట మండలాలను ఏర్పాటు చేస్తాం..’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆమనగల్లులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ అంధకారంలోకి వెళ్తామని, కరెంటు కష్టాలు తప్పవన్నారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు తెలంగాణకు అన్యాయమే చేశారన్నారు. 1956లో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి సంపదను కొల్లగొట్టారని, 1969లోనే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తే 369 మంది విద్యార్థులను బలితీసుకున్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆరు గ్యారంటీలు అమలు కాకపోవడంతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ను ఈసడించుకుంటున్నారన్నారు. ఉవ్వెత్తున ఉద్యమం చేసి ఢిల్లీ దొరల తలలు వంచి తెలంగాణను తెచ్చుకున్నామన్నారు.
రాష్ట్రం సిద్ధించాక సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తూ రైతులకు అండగా నిలిచామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్నో గిరిజన తండాలను పంచాయతీలు మార్చామని, గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఆమనగల్లులో ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కాగా, షాద్నగర్లో నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్డు షోకు జనం పోటెత్తారు.
– కల్వకుర్తి/ఆమనగల్లు, నవంబర్ 5
కల్వకుర్తి / ఆమనగల్లు, నవంబర్ 5: తెలంగాణ బిడ్డలను అరిగోస పాల్జేసిన ఢిల్లీ దొరల పాలన కావాలా… అభివృద్ధి, సంక్షేమ పాలననిచ్చే కేసీఆర్ కావాలా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దొరల తెలంగాణ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన తీరుపై ఆయన విరుచుకు పడ్డారు. అసలు ఢిల్లీ దొరలు మీరు.. తెలంగాణకు ఆది నుంచి అన్యాయం చేసింది మీరు, మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ నుంచి మీ నాయినమ్మ ఇందిరాగాంధీ వరకు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 1956లో తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేసి తెలంగాణ యాస భాష, సంస్కృతి, సంపదను కొల్లగొట్టారు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సాగుతుంటే 369 మంది విద్యార్థులను బలితీసుకున్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలికొన్నది ఎవరు అని కేటీఆర్ ప్రశ్నించారు.
1956నుంచి తెలంగాణను చెరబట్టిన ఢిల్లీ దొరల కాంగ్రెస్ పార్టీ కాదా.. అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ ఉద్యమం సాగించారని, ఉద్యమ ఫలితంగానే ఢిల్లీ దొరలు తలవంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.
సభలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పక్క రాష్ర్టాలనుంచి నాయకులను అరువు తెచ్చుకుని ప్రచారం నిర్వహిస్తున్న మీరు నాయకులేనా అంటూ మండిపడ్డారు. డబ్బు సంచులతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకున్న మీ పార్టీ నాయకుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడిన మాటలతో తెలంగాణ బిడ్డలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. డికే శివకుమార్ వ్యవసాయానికి కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని, తెలంగాణలో కూడా 5 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన ప్రసంగాలతో కాంగ్రెస్ నాయకులను ఈసడించుకుంటున్నారని కేటీఆర్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు ఉండదు, ఎరువుల విత్తనాల కొరకు లైన్లు తప్పవని, పెట్టుబడి సాయం రైతు బంధుకు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ను ఢీ కొట్టేందుకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు తండొపతండాలుగా వస్తున్నారని, ప్రజా బలం ఉన్న కేసీఆర్ను ఎవ్వరూ ఏం చేయలేరని కేటీఆర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అస్త్ర సన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలను చేశామని, గిరిజన రిజరేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని గుర్తు చేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీ భవితే అంధకారం అవుతుందని కేటీఆర్ సూచించారు. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్యాలయంతో పాటు, గట్టుప్పలపల్లి, వెల్జాల్, రఘుపతిపేట మండలాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అంతకుముందు కేటీఆర్కు బీఆర్ఎస్ నేతలు గధ, గొంగడి, గొర్రెపిల్లను బహూకరించారు. సభకు వచ్చిన నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ, డబ్బు మూటలతో వచ్చిన కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని సూచించారు. రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతో వచ్చిన ప్యారాచూట్ నేతలకు ఓట్లు వేయవద్దని నాగం పిలుపునిచ్చారు. అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్పార్టీకి చెందిన అభ్యర్థి డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీటీసీలు అనురాధ. దశరథ్నాయక్, విజితారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, ఎంపీపీలు నిర్మల, మనోరమ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీలు అనంతరెడ్డి, ఆనంద్, వివిధ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్రావు, నేనావత్ పత్యానాయక్, కంబాల పరమేశ్, నిట్ట నారాయణ, ఎంపీటీసీలు కుమార్, సరిత, కౌన్సిలర్ కమఠం రాధమ్మ, సర్పంచ్లు లక్ష్మీ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, శ్రీనివాస్, వెంకటయ్య, రఘు, రామకృష్ణ, సాయిలు, సుభాష్, జహంగీర్ యువజన విభాగం నాయకులు కొమ్ముప్రసాద్, వెంకటేశ్, కిరణ్, కృష్ణ, సతీశ్, రమేష్, భాస్కర్, రంజిత్, యాదయ్య, హనీఫ్, అక్బర్, అప్సర్, మైసయ్య, వెంకటయ్య, శివ, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.