పరిగి, నవంబర్ 13 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సంవత్సరంలో జిల్లాకు కృష్ణాజలాలను అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్ రెడ్డికి మద్దతుగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి ఆయన కులకచర్ల లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 55 ఏండ్ల అధికారంలో కాంగ్రెస్ తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. ప్రస్తుతం ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్య పెడుతున్నదన్నారు. కాంగ్రెస్లో అందరూ సీఎంలేనని, ఎప్పుడూ కుర్చీకోసం కుమ్ములాటలే తప్ప ఆ పార్టీతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. రేవంత్ని ఇప్పుడంతా రేటెంత రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్న ఓటుకు నోటు, నిన్న సీటుకు రేటు.. రేపు అధికారమిస్తే ప్లాట్లుగా చేసి రాష్ర్టాన్ని అమ్మేయ్యడన్న గ్యారెంటీ ఏమున్నదని ప్రశ్నించారు. అందువల్ల ప్రజలు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి అక్కడి రైతులు చెంపలేసుకుంటున్నారన్నారు.మూడోసారి అధికారంలోకి రాగానే మరో నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ముదిరాజ్లు త్వరలో శుభవార్త వింటారన్నారు. మహేశ్రెడ్డిని మరోసారి గెలిపించుకొని ప్రగతికి పట్టం కట్టాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదట పరిగి నియోజకవర్గానికి చెందిన భూములకే సాగునీరు అందనున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు తెలిపారు. సోమవారం కులకచర్లలోని రోడ్ షోలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇటీవలె మొదటి మోటర్ ప్రారంభించామని, కాంగ్రెసోళ్లు దరిద్రులు అడ్డం రాకపోతే ఈపాటికే కులకచర్లకు నీళ్లు వచ్చేవన్నారు. రాబోయే సంవత్సరం కాలంలోనే కృష్ణా జలాలు తెచ్చి ఇచ్చే బాధ్యతను తాను, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తీసుకుంటామని తెలిపారు. ఇక్కడొక కాంగ్రెసోడు మాట్లాడుతున్నాడంట నీళ్లు రాలే అంటున్నాడంట, మేమేదో ప్రాణహిత-చేవెళ్ల పెట్టినం, మీరు తీసేసిండ్రు అంటున్నాడంట, అతడికి బస్సు పెట్టి పంపిద్దాం, పంపు చాల్ అయిందా లేదా, నీళ్లు ఎల్లినయా లేవా, ఆడికెళ్లి బయలుదేరాయా లేదా చూసి రమ్మనుండ్రి అని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గ్రామాల్లో ఎవరైనా కాంగ్రెసోళ్లు నీరు రాలేదంటే కేసులు ఎందుకు వేసినారు, ఎందుకు ఆపారాని అడగండని సూచించారు. కేసీఆర్ మొండోడు, అనుకున్నడంటే బరాబర్ చేసి చూపిస్తారని తెలిపారు. ఇక్కడ కాంగ్రెసోడు మాట్లాడుతున్నాడంట మహేశ్రెడ్డి ఇది ఇట్ల ఎందుకుంది, అది అట్ల ఎందుకుందని రాగాలు తీస్తున్నాడంట అని పేర్కొన్నారు. దేశంలో 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమి చేసిందని, గుడ్డి గుర్రాల పండ్లు తోమారా, ఆరోజు కరెంటు, నీళ్లు ఎందుకు ఇయ్యలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందరి కంటే ముందు వచ్చి కేసీఆర్తో నడిచిన వారు కొప్పుల హరీశ్వర్రెడ్డి అని, ఈ విషయాన్ని మరిచిపోరాదన్నారు. హరీశ్వర్రెడ్డి మనతో లేరని, ఆయన ఆత్మ శాంతించాలంటే ఈసారి మహేశ్రెడ్డిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించాలన్నారు. మహ్మదాబాద్, గండీడ్ను వికారాబాద్లో కలపాలని మహేశ్రెడ్డి అడిగారని, మహేశ్రెడ్డిని జబర్దస్త్ మెజారిటీతో గెలిపించండి వారం రోజుల్లో ఈ రెండు మండలాలను వికారాబాద్లో కలిపిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కులకచర్ల మండలానికి జూనియర్ కాలేజీ, పరిగి మండలానికి పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీని ఇస్తామన్నారు. ఈ పనులు కాంగ్రెసోడు చేయాలంటే ఢిల్లీకి పోవాలని, మనకు ఈ సిల్లీ ఫెలోస్ అవసరమా అని ప్రశ్నించారు.
పరిగికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరని, సీఎం కేసీఆర్ దగ్గర కూర్చొని పనులు మంజూరు చేయించుకోవడంతోపాటు పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు తెచ్చుకుందామన్నారు. కాంగ్రెస్ చెబుతున్న ఆరు గ్యారెంటీలంటే ఆరు నెలలకు ఒక సీఎం మారుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. మొన్న ఓటుకు నోటు, నేడు సీటుకు రేటు, రేపు పరిగినంతా అమ్మేయడా అని రేవంత్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ఓటు వేసిన పాపానికి కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. పరిగి, కులకచర్ల, గండీడ్, మహ్మదాబాద్, దోమ రైతన్నలు ఒకటే ఆలోచించుకోవాలని, కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు. ఆనాడు అర్ధరాత్రి బాయికాడ పడుకున్న రోజులు ఉన్నాయన్నారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత సీఎం కేసీఆర్, కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి శుభవార్త చెబుతారని పేర్కొన్నారు. మైనారిటీలను కాంగ్రెస్ ఓట్లు వేసే యంత్రంగానే చూసిందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు గల అసైన్డ్ భూమిపై సంపూర్ణమైన హక్కులు కల్పిస్తామన్నారు. బీసీలకు గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు పెట్టుకున్నామని, ఎస్సీలు, మైనారిటీలకు వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, వాటన్నింటినీ జూనియర్ కాలేజ్లు చేసుకోబోతున్నామన్నారు. భవిష్యత్తులో డిగ్రీ కాలేజీలుగా ఏర్పాటు చేసుకోవడంతోపాటు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామన్నారు.
పరిగి నియోజకవర్గంలోని ప్రతి తండాలోనూ సేవాలాల్ భవన్ కట్టిచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. పరిగిలో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మాణం చేపడుతున్నారని, ప్రతి తండాలోనూ సేవాలాల్ భవన్ నిర్మాణం చేపడతామన్నారు. మండల కేంద్రాలు, ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలకు మహిళా భవనం కట్టిచ్చే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీలేనని, కర్ణాటకలో, దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని కాంగ్రెస్ తెలంగాణలో చేయదన్నారు. రోడ్షో సందర్భంగా చూపించిన ఉత్సాహాన్ని ఈనెల 30వ తేదీన పోలింగ్ రోజు ఓటు రూపంలో వేసి గులాబీ జెండా ఎగురవేయడంతోపాటు సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలు మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పరిగి నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి నాగేందర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, కొప్పుల అనిల్రెడ్డి, పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.