గనుల లీజుతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. గత ఐదేండ్లలో వికారాబాద్ జిల్లా నుంచి ఏకంగా రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. మైనింగ్తో ఏటా రూ.80 కోట్ల రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. జిల్లావ్యాప్తంగా మొత్తం 925 హెక్టార్లలో గనులు విస్తరించి ఉన్నాయి. పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో అత్యధికంగా 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులుండగా, తాండూరు మండలంలో 100 హెక్టార్లలో 160 నాపరాయి మైన్స్ ఉన్నాయి. అలాగే ఆయా మండలాల పరిధిలో 86 హెక్టార్లలో కంకర, 76 హెక్టార్లలో పలుగురాళ్లు, 41 హెక్టార్లలో సుద్ద, 12 హెక్టార్లలో గ్రానైట్ గనులున్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలతో మైనింగ్ ద్వారా జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం అందుతున్నది.
-వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గనుల లీజు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. గత ఐదేండ్లలో మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.400 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో మైనింగ్ లీజులైన పెద్ద తరహా, చిన్న తరహా గనుల ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.80 కోట్లు రెవెన్యూ జిల్లా ఖజానాకు చేరుతున్నది. జిల్లాలోని మేజర్, మైనర్ గనుల లీజుల ద్వారా అంచనాలకు మించి ఆదాయం సమకూరుతుండడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం కూడా నిర్దేశించిన లక్ష్యానికి మించి గనుల లీజుల ద్వారా ఆదాయం వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులు., తాండూరు మండలంలో 100 హెక్టార్లలో 160 నాపరాయి గనులు., 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులు., పెద్దేముల్, మర్పల్లి, ధారూరు మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద గనులు., వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులు, దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులున్నాయి. జిల్లాలోని పెద్ద తరహా, చిన్న తరహా గనుల లీజు ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.83.75కోట్లు, 2019-20లో రూ.87.63కోట్లు, 20 20-21లో 75.05కోట్లు, 2021-22లో రూ.83.63కోట్లు, 2022-23లో ఇప్పటివరకు రూ.68.24కోట్ల ఆదాయం జిల్లా ఖజానాకు సమకూరింది.
జిల్లాలో అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతున్నది. కొందరు ఎలాంటి అనుమతులు లేనప్పటికీ గనులను తవ్వుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమతి తీసుకున్నదానికంటే ఎక్కువ స్థలంలో తవ్వకాలు జరుపుతున్నట్లు.. ఇంకొందరు లీజు పూర్తైనప్పటికీ గనులను తవ్వుతున్నట్లు.. కొన్నింటిని జిల్లా గనుల శాఖ అధికారులు సీజ్ చేసినప్పటికీ తిరిగి తవ్వకాలు జరుపుతున్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.
అంచనాలకు మించి ఆదాయం : సాంబశివరావు, జిల్లా గనుల శాఖ ఏడీ
జిల్లాలోని పెద్ద, చిన్నతరహా గనుల లీజుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. ప్రతి ఏటా అంచనాలకు మించి ఆదాయం వస్తున్నది. గనుల్లో అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాం. దీనిని అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాం.