రంగారెడ్డి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో వలస ఓటర్లు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నా నిబంధనతో ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు ఉన్నవారు తాము ఎక్కడ ఓటు నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో వలస ఓటర్లే కీలకంగా మారారు.
పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను వలస ఓటర్లు ప్రభావితం చేస్తున్నారు. ఇక నుంచి ఒకే ఓటు ఉండే అవకాశముండటంతో ఆ ఓటును సొంత గ్రామాల్లో ఉంచుకోవాలా.. లేక శివారుల్లో నివాసముంటున్న ప్రాంతాల్లో ఉంచుకోవాలా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను కూడా అందజేశారు.
త్వరలోనే తమ నిర్ణయాన్ని తెలుపుతూ ఫారాలను నింపి అధికారులకు అందజేయాల్సి ఉన్నది. ఓటర్లు మాత్రం ఎక్కువమంది తమ సొంత ఊర్లల్లోనే ఓటు నమోదు చేయించుకోవాలని అభిప్రాయానికి వచ్చి సొంత ఊర్లను ఎంపిక చేసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం శివారు ప్రాంతాల్లోనే ఓటు నమోదు చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో ఎన్యుమరేషన్ ఫారాలను నింపే ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
జిల్లా పరిధిలోని ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం వంటి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల నిర్ణేతలుగా ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ, యాదాద్రి, నాగర్కర్నూల్, దేవరకొండ, వికారాబాద్, పరిగి వంటి ప్రాంతాలకు చెందిన అనేకమంది ఓటర్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓట్లను నమోదు చేసుకున్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందినవారు కూడా జిల్లాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. సర్ ప్రక్రియ ద్వారా వీరి ఓట్లు ఎక్కడ నమోదు చేసుకుంటారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రం. రెండు దశాబ్దాల నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తట్టిఅన్నారం జీవీఆర్ కాలనీలో ఉంటున్నాను. సొంతూరుతోపాటు ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నది. సర్తో ఒకే చోట ఓటు హక్కు ఉంటుందని అంటున్నారు. అట్లయితే సొంతూరులోనే ఓటు వేస్తాం. సొంతూరులో పొలాలున్నాయి. ఊరికి వెళ్లి ఓటు వేసేందుకే మొగ్గు చూపుతాం.
– కొల్లు రమేశ్రెడ్డి, జీవీఆర్ కాలనీ, పెద్దఅంబర్పేట్
