రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని లేని పక్షంలో ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గత ప్రభుత్వంలో ప్రారంభించిన అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల నాటి హామీని నిలబెట్టుకోవాలన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న, జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ, ఎల్లేశ్, బుగ్గ రాములు, శేఖర్, బాల్ రాజ్, చందూనాయక్, శ్రీను. అలివేలు, సరిత, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.